తెలంగాణలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విమానాశ్రయాల నిర్మాణానికి స్థల అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచిగానీ, ఎయిర్పోర్టు డెవలపర్ నుంచిగానీ తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం లోక్సభలో బీజేపీఎంపీలు ధర్మపురి అర్వింద్, ఎం.రఘునందన్రావులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరు చోట్ల విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ప్రీ-ఫిజిబిలిటీ అధ్యయనం చేపట్టిందని తెలిపారు.
‘తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆరు చోట్ల ప్రీ-ఫిజిబిలిటీ అధ్యయనం చేపట్టింది. వరంగల్, ఆదిలాబాద్లో బ్రౌన్ఫీల్డ్, జక్రాన్పల్లి (నిజామాబాద్)లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సాంకేతికంగా వీలున్నట్లు గుర్తించింది. ఈ మూడు చోట్ల విమానాశ్రయ నిర్మాణాలు చేపట్టాలనుకుంటే అబ్స్టకిల్ లిమిటేషన్ సర్ఫేసెస్ సర్వే చేపట్టి, పౌర విమానయాన శాఖ, ఇతర రెగ్యులేటరీ, చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు తీసుకొవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సూచించింది.
తర్వాత తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ వద్ద ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించింది.. అయితే, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణం, అందుకు స్థల అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు రాలేదు.. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆలేరు, కాగజ్నగర్ ఎయిర్పోర్టులు/ ఎయిర్స్ట్రిప్లు ఉడాన్ డాక్యుమెంట్లో అన్సర్వ్డ్ విమానాశ్రయాల జాబితాలో ఉన్నాయి. ఇక్కడి నుంచి విమానాలు నడపడానికి ఒక్క ఆపరేటర్ కూడా బిడ్డింగ్ దాఖలు చేయలేదు’ అని కేంద్ర మంత్రి మొహూల్ వివరించారు.
ఇక, తెలంగాణలో ప్రస్తుతం రూ.21,446.95 కోట్లతో దాదాపు 1,360 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ మేరకు ఎంపీలు ఆర్.రఘురాంరెడ్డి, ఎం.రఘునందన్రావులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇవన్నీ 2026 చివరి నాటికి పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్నగర్ జిల్లా దేవరకొండలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఏర్పాటు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఆదిలాబాద్లో బ్రౌన్ఫీల్డ్ (ప్రస్తుతం ఉన్నవి అభివృద్ధి) ఎయిర్పోర్టులు అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఇందులో మామునూరు, జక్రన్పల్లి, ఆదిలాబాద్లో మాత్రమే సాంకేతికంగా ఫీజిబిలిటీ ఉన్నట్టు ఏఏఐ గతంలోనే పేర్కొంది. మిగతా విమానాశ్రయాల గురించి మాత్రం ప్రస్తావించలేదు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును సాధిస్తామని ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa