తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇలా మొదలైందో లేదో మళ్లీ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాతో పాటు పలు మీడియా సంస్థల్లో కూడా వార్తలు ప్రసారమయ్యాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో.. రేషన్ కార్డుల దరఖాస్తులు, మార్పులు చేర్పుల దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందంటూ.. దీంతో ప్రభుత్వం కూడా దరఖాస్తుల స్వీకరణను నిలిపేసిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమైన ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
రేషన్ కార్డుల ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఈసీఐ బ్రేక్ వేసిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల ఆన్లైన్ దరఖాస్తులకు ఈసీఐ బ్రేక్ వేసిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. పౌర సరఫరాల శాఖ, మీ సేవా యాజమాన్యాలు తమను సంప్రదించలేదని కూడా ఈసీఐ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో.. రేషన్ కార్డుల జారీని ఈసీఐ నిలిపివేసిందనే వార్తలను ఈసీఐ పూర్తిగా ఖండించింది.
అయితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. జనవరి 26వ తేదీన కొత్త రేషన్ కార్డులను జారీ చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జనవరి 26కు ముందే క్షేత్రస్థాయిలో అధికారులు సర్వేలు చేసి అర్హులైన వారి పేర్లతో జాబితాలు ప్రకటించారు. అయితే.. ఆ జాబితాల్లో చాలా మంది పేర్లు రాలేదని ఆందోళన చెందగా.. వాళ్లందరికీ మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం.
రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. జాబితాల్లో పేర్లు రాని అర్హులందరూ మళ్లీ దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. చాలా మంది ప్రజలు రేషన్ కార్డులకు మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే.. రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఉపశమనం కలిగిస్తూ.. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు నిన్ననే (ఫిబ్రవరి 08న) రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే.. శుక్రవారం (ఫిబ్రవరి 07న) ఆన్లైన్ దరఖాస్తుల ప్రకటన చేయగా.. శనివారం (ఫిబ్రవరి 08న) పోర్టల్ ఆగిపోవటం గమనార్హం. అసలే పోర్టల్ ఆగిపోయిందని ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉండగా.. ఇంతలోనే ఈసీ బ్రేకులు వేయటంతో.. ప్రజలంతా ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. కాగా.. ఈ వార్తలన్ని అవాస్తమని స్వయంగా ఈసీఐ స్పందించి స్పష్టత ఇవ్వటంతో.. ప్రజలు కాస్త ఉపశమనం పొందినట్టయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa