ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ పరువు నష్టం నోటీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 05:47 PM

గ్రూప్-1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం నోటీసులు పంపింది. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రాకేశ్ రెడ్డి ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. ఇదిలావుంటే టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత ఏ. రాకేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 4 తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో 563 పోస్టులు ఉండగా.. మొదటి 500 ర్యాంకుల్లో ఒక్క తెలుగు మీడియం విద్యార్థి కూడా లేకపోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇది ఎంపిక ప్రక్రియపై సందేహాలను కలిగిస్తోందని చెప్పారు. కొన్ని ప్రత్యేక పరీక్షా కేంద్రాల నుండి పలువురు అభ్యర్థులు విజయం సాధించారన్నారు. కేవలం రెండు కేంద్రాల నుంచే 74 మంది టాపర్లు రావడం మరియు 15 కేంద్రాల నుండి అందరూ ర్యాంకర్లు ఉండటంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.


ఒకే కేంద్రానికి చెందిన అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు రావడం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. మూడవ మూల్యాంకనాన్ని నిర్వహించలేదని, రెండవ రౌండ్ మూల్యాంకనాన్ని కూడా కాంట్రాక్ట్ సిబ్బందితో నిర్వహించారని, రెగ్యులర్ ప్రొఫెసర్‌లతో కాదని ఆయన ఆరోపించారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉండవచ్చనే అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఫలితాలు రాకముందే కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలు ఎలా అంచనా వేయగలిగాయని ఆయన ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నుండి సమాచారం లీక్ అయి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు టీజీపీఎస్సీ ద్వారా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, గ్రూప్-1 పరీక్షల 20,000 జవాబు పత్రాలను కూడా సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని విమర్శించారు. తెలంగాణలోని ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలలను మూసివేయడం, గ్రూప్స్ సిలబస్ నుండి తెలుగు అకాడమీ పుస్తకాలను తొలగించడం ద్వారా ముఖ్యమంత్రి తెలుగు భాషను అవమానించారన్నారు. గ్రూప్-1 పరీక్షల అన్ని పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని.., డేటా లీక్‌పై విచారణ జరిపించాలని డింమాడ్ చేశారు. ఆయన ఆరోపణలపై స్పందించిన టీజీపీఎస్సీ తాజాగా పరువు నష్టం నోటీసులు పంపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa