తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి హస్తిన పయనమవనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన రాత్రికి ఢిల్లీ చేరుకొని, అక్కడే బస చేయనున్నారు. ఈ ఆకస్మిక పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు, పార్టీ సంస్థాగత విషయాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లే ముందు అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రేపు ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు హాజరయ్యే ఈ సమావేశంలో దేశవ్యాప్త రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అధిష్టానానికి వివరించే అవకాశం ఉంది.
ఎల్లుండి కాంగ్రెస్ అధిష్టానంలోని కీలక పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఆశావహుల జాబితాను పరిశీలించి, సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రుల ఎంపికపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని, తద్వారా పార్టీలో సీనియర్లకు న్యాయం చేయాలని సీఎం భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల్లో, ముఖ్యంగా మంత్రి పదవులు మరియు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి లభిస్తాయనే విషయంపై గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఢిల్లీ నుంచి సీఎం తిరిగి వచ్చేటప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పూర్తి స్పష్టతతో వస్తారని, త్వరలోనే శుభవార్త వినవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa