ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా అనుకూల, ప్రగతిశీల బడ్జెట్,,,,కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 07:46 PM

కేంద్ర బడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజా అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, పేదతరగతి ప్రజలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు.


అలాగే వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి కోసం ఐదు కీలక రంగాలను గుర్తించారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ అడుగులు వేసిందని.. దేశాభివృద్ధి కోసం ఇదో సమగ్ర, సమ్మిళిత బ్లూప్రింట్‌గా చంద్రబాబు అభివర్ణించారు. దేశానికి వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు కేంద్ర బడ్జెట్‌లో పన్నుల నుంచి ఉపశమనం కలిగించారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరగకపోయినా.. ఏపీలోని పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.


పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ. 54 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖపట్నం పోర్టుకు రూ.730 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం రూ.162 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.242.50 కోట్లు, లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు రూ.375 కోట్లు, జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇవి కాక జల్ జీవన్ మిషన్ పొడిగింపు, ఉడాన్ ద్వారా కూడా ఏపీకి మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com