ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌పై నిర్మలమ్మ వరాల జల్లు.. యూనియన్ బడ్జెటా, బీహార్ బడ్జెటా అంటున్న నెటిజెన్లు!

national |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 08:46 PM

ఈ సంవత్సరం అక్టోబర్ - నవంబర్ నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఇచ్చింది కేంద్రంలోకి బీజేపీ సర్కారు. గత బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసిన కేంద్రం, ఈ బడ్జెట్‌లో ఎన్నికలు జరగబోయే బీహార్‌కు అగ్రభాగాన్ని కేటాయించింది.


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ


దేశ తూర్పు ప్రాంతంలోని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించేలా బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


పశ్చిమ కోసి కెనాల్


బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చేలా పశ్చిమ కోసి కాల్వకు ఆర్థిక సాయం ప్రకటించింది కేంద్రం.


మఖానా బోర్డు


మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడించడం సహా మార్కెటింగ్‌ను మెరుగుపరచడానికి బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు సీతారామన్. ఈ బోర్డు ద్వారా రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు స్థానికులకు అందేలా కూడా బోర్డు కృషి చేస్తుందన్నారు. వీటితో పాటు ఐఐటీ పాట్నను విస్తరణ, పాట్నా విమానాశ్రయ విస్తరణ, మరో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.


బీహార్‌ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలం టూ బీహార్ సర్కారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు 32 పేజీల మెమోరాండం సమర్పించింది. అందులో చాలా డిమాండ్‌లు ఉన్నాయి. బీహార్‌ ఉత్తర ప్రాంతాల్లో వరదల సమస్యను పరిష్కరించడానికి ఎత్తైన ఆనకట్టలను నిర్మించడానికి నేపాల్‌తో కలిసి చర్యలు చేపట్టాలని కోరింది. గండక్, కోసి, కమ్లా వంటి కీలకమైన అంతర్జాతీయ, అంతర్‌-రాష్ట్ర నదులను వరద నిర్వహణ కార్యక్రమం కింద చేర్చాలని విజ్ఞప్తి చేసింది.


బీహార్‌లోని 26 జిల్లాలకు వర్షాకాలంలో సమర్థవంతమైన నీటిపారుదల కోసం అదనపు వంతెనలు, కల్వర్టుల నిర్మాణాల కోసం రూ.13 వేల కోట్లు కేటాయించాలని కోరింది. అలాగే అదనపు రుణ పరిమితిని అనుమతించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. 100 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటు, హై-స్పీడ్ కారిడార్ల నిర్మాణం, కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, 10 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు సహా మరిన్ని డిమాండ్లను కేంద్రానికి సమర్పించింది బీహార్.


సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ బిజెపికి లేకపోవడంతో నితీశ్ కుమార్, చంద్రబాబు తమ మద్దతును ఇవ్వడంతోనే బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిందని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ గత బడ్జెట్‌లో, ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలకు అధిక కేటాయింపులు జరుపుతోంది కేంద్రం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com