ప్రియుడి మోజులో పడి ఓ మహిళ ఎంతటి దారుణానికి పాల్పడిందో చూడండి. దారుణం అనడం కంటే కట్టుకున్న భర్త పట్ల నయవంచనకు పాల్పడిందంటేనే సమంజసంగా ఉంటుందేమో! కుమార్తె చదువు కోసం అని చెప్పి భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసిన ఆ మహిళ... రాత్రికి రాత్రే ప్రియుడితో పరారైంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. హౌరా జిల్లాలోని సంక్రైల్ లో సదరు మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. అయితే, పేదరికం కారణంగా వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, సదరు మహిళ పెయింటర్ గా పనిచేసే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె ప్రియుడు బారక్ పూర్ ప్రాంతానికి చెందినవాడు. ఇద్దరికీ ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.ఇక, ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో సుఖంగా గడపడానికి ఆమె తిరుగులేని ప్లాన్ వేసింది. కుమార్తెను చదివించాలి, పెళ్లి చేయాలి... అందుకు డబ్బు కావాలి... నీ కిడ్నీ అమ్మేద్దాం అని భర్తను ఒప్పించింది. భార్య అదే పనిగా ఒత్తిడి చేస్తుండడంతో ఆ భర్త సరేనన్నాడు. ఓ ఏడాది తర్వాత కిడ్నీ కొనడానికి ఓ వ్యక్తి దొరికాడు. తాను ఇచ్చే డబ్బుతో ఆ కుటుంబం బాగుపడుతుందని నమ్మిన ఆ వ్యక్తి కిడ్నీ కొనుగోలు చేశాడు. కానీ ఆ మహిళ అందరినీ మోసం చేసి కిడ్నీ అమ్మగా వచ్చిన రూ.10 లక్షల డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి పరారైంది. దాంతో దిగ్భ్రాంతికి గురైన ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె, తన పెయింటర్ ప్రియుడితో కలిసి బారక్ పూర్ లో ఉంటోందని గుర్తించిన భర్త 10 ఏళ్ల కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అయితే, భర్త, కుమార్తె వచ్చినా... ఆ మహిళ తలుపు తీయలేదు. విడాకులు ఇచ్చేస్తాను వెళ్లిపో అంటూ కేకలు వేసింది. అత్తమామలు కూడా వచ్చి బతిమాలినా ఆ మహిళ ఇంట్లోంచి బయటికే రాలేదు.