కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అనేక కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లోనూ వేగం పెరిగింది. శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ ప్రాంతవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించే పనులు చేపట్టింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో హిందూ కళాశాల నుంచి ఏసీ కళాశాల వరకు కూల్చివేతలు చేపట్టారు.
మరోవైపు విస్తరణ పనుల్లో భాగంగా.. 134 ఆస్తులకు సంబంధించిన యజమానులకు నోటీసులు జారీ చేశారు. కూల్చివేతలకు పలువురు యజమానులు కూడా అంగీకరించినట్లు తెలిసింది. అలాగే యజమానులకు టీడీఆర్ బాండ్లు కూడా జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనుల కోసం రూ. 98 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.21 కిలోమీటర్ల మేరకు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. గుంటూరు గవర్నమెంట్ మహిళా కళాశాల నుంచి అరండల్పేట పదోలైను వరకు ప్రస్తుతం ఉన్న వంతెన స్థానంలో నాలుగు వరుసలతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు.
ఆర్వోబీకి రెండు వైపులా 30 అడుగుల వెడల్పుతో సర్వీసు రోడ్లు నిర్మించనున్నారు. సర్వీసు రోడ్లతో పాటుగా ఇతర అవసరాలకు భూమిని సేకరించనున్నారు.ఈ వంతెన నిర్మాణానికి రూ. 108 కోట్ల వరకు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. కేంద్ర ప్రభుత్వం రూ. 98 కోట్లకు ఆమోదం తెలిపింది. మిగిలిన మొత్తాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ భరించనుంది. నిర్మాణ పనుల కోసం ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానిస్తున్నారు. ఏపీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా మార్చి 28 వరకూ టెండర్ల దాఖలుకు అవకాశం ఉంది.
గుంటూరు-నల్లపాడు రైల్వేసెక్షన్లో 1958లో ఆర్వోబీ నిర్మించారు. అయితే ఇది శిథిలావస్థకు చేరుకోవటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శంకర్విలాస్ వంతెన అవసరం గుర్తించి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిధులు విడుదల కోసం కేంద్రానికి లేఖరాసి.. నిధులు కేటాయింపునకు కృషి చేశారు.
![]() |
![]() |