ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు బిగ్ షాక్

national |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:14 PM

 కర్ణాటకలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నటి రన్యా రావుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బంగారం అక్రమ రవాణా కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని పేర్కొన్న జడ్జి విశ్వనాథ్ సీ గౌడర్.. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఆమెను జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలని ప్రాసిక్యూషన్ చేసిన వాదనలతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ పిటిషన్ కొట్టేశారు. మరోవైపు.. రన్యా రావు బెయిల్ పిటిషన్‌ ఇప్పటికే మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించగా.. తాజాగా ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు కూడా అదే తీర్పునిచ్చింది. దీంతో సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు రన్యారావు లాయర్లు రెడీ అయ్యారు.


దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ.. మార్చి 4వ తేదీన బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్యారావు డీఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె వద్ద రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు తన నడుముకు ధరించిన బెల్టులో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.


రన్యా రావు సినీ నటి కావడం, ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ హోదాలో ఉండటం.. ఆమె వెనుక పెద్ద పెద్ద నేతలు, సెలబ్రిటీలు ఉన్నారని వార్తలు రావడంతో ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన అధికారులు.. రన్యా రావు ఇంట్లో సోదాలు నిర్వహించగా.. మొత్తంగా రూ.17.29 కోట్ల విలువైన బంగారం, నగదు పట్టుబడింది.


ఇక ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకోగా.. ఆ పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారు, వారు ఏమేం గిఫ్ట్‌లు ఇచ్చారు అనేది తేల్చేందుకు రన్యా రావు పెళ్లి వీడియోను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు.. గతేడాది కాలంలో రన్యా రావు దాదాపుగా 30 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రతీ ట్రిప్‌లోనూ ఆమె పెద్ద మొత్తంలో బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్మగ్లింగ్ చేసిన ప్రతీ కిలో బంగారానికి ఆమె లక్ష రూపాయాలు సంపాదించిందని.. ఒక్కో ట్రిప్‌కు రూ.12-13 లక్షలు సంపాదించేదని తేలింది.


ఇక బెంగళూరు ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ సహాయాన్ని అందించడానికి.. ఆమె సవతి తండ్రి డీజీపీ రామచంద్రరావు ఆర్డర్ ఇచ్చే వాడని ఎయిర్‌పోర్టు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో కర్ణాటక వ్యాప్తంగా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com