ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి స్పందించారు. పక్కనున్న రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ది శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమిని గెలిపిస్తే ఇంధనంపై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ ధర రూ. 109.60 పైసలు, డీజిల్ ధర రూ 97.47 పైసలుగా ఉందన్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86 పైసలు, డీజిల్ ధర రూ.92.39పైసలని తెలిపారు. అంటే తమిళనాడుతో పోల్చితే మన దగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువ ఉందన్నారు. అలాగే కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90పైసలు, డీజిల్ ధర రూ.88.99పైసలు ఉందని.. కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పారు. ఇంతే కాకుండా పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు, డీజిల్ ధర రూ. 95.70పైసలుగా ఉందని అన్నారు. అంటే తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనంగా ఉందని చెప్పుకొచ్చారు. పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట అని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరొకటి కాదన్నారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారన్నారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి.. రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని ఆరోపించారు. బాబు మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.20వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూళ్లు చేస్తే.. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. తీరా అధికారం ఇస్తే ఆయనే బాదుడుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |