ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15వేలు ఎప్పుడిస్తారో తేల్చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 06:07 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 9 నెలల్లో వరుసగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రూ.4 వేలు పింఛన్‌ లేదని.. ఏపీలో మాతమ్రే ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దీపం-2 కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామని.. చెత్త పన్నును తొలగించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లతో రూ.5కే భోజనం అందిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని.. గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించడమే లక్ష్యమన్నారు.


ఏపీలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం.. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున అందజేస్తామని.. వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందన పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని.. అర్హత ఉంటే చాలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే రూ.15వేల చొప్పున అందజేస్తామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో.. డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లు ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.


రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అన్నారు చంద్రబాబు. ప్రజల సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యమని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని అందరం కలిసి గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచనలు చేశారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని.. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమన్నారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని.. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి కూడా జరగాలన్నారు. అప్పులు తెస్తే ఎంతకాలం కొనసాగించలేమో కొనసాగించలేమన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌.. ప్రపంచంలోనే బెస్ట్‌ మోడల్‌తో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి. 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. అయోమయంలో ఉన్న ప్రాజెక్టును గాడిలో పెట్టామన్నారు. . 'ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం.. ల్యాండ్‌ మానిటైజేషన్‌ ద్వారా ఈ అప్పులు తీర్చేస్తాం' అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com