ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి నిధులు విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 11:45 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు శుభవార్త అందించింది. రాజధాని అమరావతి నిర్మాణాల కోసం ఇదివరకే ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు మంజూరు చేయగా, ఇందులో మొదటి విడత రుణంగా రూ.3,535 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. దీనితో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడినట్టయింది.ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడీబీ రూ.6,700 కోట్ల రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల నుండి రూ.13,600 కోట్లు రుణం రూపంలో అందుతుండగా, అదనంగా రూ.1,400 కోట్లు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తోంది. మరోవైపు హడ్కో నుండి రూ.11 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి అందింది. అంతేకాకుండా, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరొక రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నిజానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు గత డిసెంబర్ నెలలోనే ఆమోదం పొందాయి. ఆ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలోనే బ్యాంకుల నుంచి మొదటి విడత నిధులు రావాల్సి ఉంది. అయితే అమరావతి రాజధానిగా పనికిరాదని, రుణం ఇవ్వవద్దంటూ కొందరు ఆ బ్యాంకులకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు ఆలస్యమైంది. చివరికి మొదటి విడత నిధులు విడుదల కావడంతో అమరావతి రాజధాని పనులు వేగవంతం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com