ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసిన మీరట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు ముస్కాన్ రస్తోగి ఎవరూ ఊహించని విధంగా గర్భవతిగా నిర్ధారణ అయింది. జైలులో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రెగ్నెంట్ అని తేలింది. భర్త లండన్ లో ఉండగా, ముస్కాన్ ఇక్కడ గర్భవతి కావడం చర్చనీయాంశం అయింది.జైలు అధికారుల అభ్యర్థన మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రి నుంచి ఒక వైద్య బృందం జైలుకు వెళ్లింది. అనంతరం ముస్కాన్ను పరీక్షించి ఆమె గర్భం దాల్చినట్లు నిర్ధారించింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ గర్భ పరీక్ష ఫలితాన్ని ధృవీకరించారు.మర్చంట్ నేవీ అధికారి అయిన తన భర్త 29 ఏళ్ల సౌరభ్ రాజ్పుత్ను ముస్కాన్ రస్తోగి (27), ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా (25) కలిసి హత్య చేశారు. అనంతరం అతని మృతదేహాన్ని సిమెంట్ తో నింపిన డ్రమ్ములో వేసి మూసివేశారు. గత నెలలో ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని కడతేర్చిన ముస్కాన్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, యూపీలోని మీరట్కు చెందిన 29 ఏళ్ల మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్.. 27 ఏళ్ల ముస్కాన్ రస్తోగిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరి వివాహం జరిగింది. భార్యను చూసుకోవాలని నేవీ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. గత మూడు సంవత్సరాలుగా వారు మీరట్ లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే, పాప పుట్టిన తర్వాత భార్య ముస్కాన్కు 25 ఏళ్ల సాహిల్తో స్నేహం ఏర్పడి.. అది కాస్తా ప్రేమ, వివాహేతర సంబంధంగా మారింది. అయితే, విషయం తెలుసుకున్న భర్త సౌరభ్ రాజ్పుత్ పాప భవిష్యత్తు కోసం భార్యతోనే ఉన్నాడు. అయితే, కన్నబిడ్డకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో సౌరభ్ లండన్ వెళ్లి అక్కడ ఒక బేకరీలో పనిచేసుకుంటున్నాడు. భర్త వేరే దేశం వెళ్లడంతో ప్రియుడికి ముస్కాన్ మరింత దగ్గరైంది. అయితే, కూతురు బర్త్డే కోసమని సౌరభ్ ఇటీవలే లండన్ నుంచి మీరట్ కు తిరిగి వచ్చాడు. దాంతో ఎక్కడా తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తాడోనని ముస్కాన్, ఆమె ప్రియుడు అతనిని అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశారు. అనంతరం అతని మృతదేహాన్ని సిమెంట్ తో నింపిన డ్రమ్ములో వేసి సీల్ చేశారు. ఆపై ప్రియుడితో విహార యాత్రకు కూడా వెళ్లింది.
![]() |
![]() |