అతివేగంతో ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు.. భారీ అగ్నిప్రమాదం, 78 మంది సజీవ దహనం(ఫోటోలు- Samayam Telugu)
ఇరాన్ నుంచి బహిష్కరించబడిన వలసదారులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై 78 మంది కాలి బూడిదైన దుర్ఘటన ఆఫ్గనిస్తాన్లో చోటు చేసుకుంది. తమ దేశంలో ఉన్న ఆఫ్గనిస్థాన్ పౌరులను ఇరాన్.. తిరిగి స్వదేశానికి పంపించగా.. వారిని వలసదారుల శిబిరాలకు తరలిస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. ఇటీవల ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన ఆఫ్గనిస్తాన్ శరణార్థులతో పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ నుంచి కాబూల్కు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు మొదట ఓ బైక్ను ఢీకొని.. ఆ తర్వాత ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో.. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ఆయిల్ ట్రక్కును ఢీకొనడంతో బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 78 మంది సజీవ దహనం అయ్యారు. చనిపోయిన వారిలో 17 మంది చిన్న పిల్లలు కూడా ఉండటం మరింత విషాదంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, స్థానికులతో కలిసి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మరికొంతమంది గాయాల పాలు కాగా.. వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా దుర్మరణం చెందారు.
నిర్లక్ష్యం, అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణం అని.. ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు హెరాత్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీతోపాటు స్థానిక పోలీసులు కూడా ధ్రువీకరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇరాన్, పాకిస్తాన్ దేశాలకు వలస వెళ్లిన ఆఫ్గానిస్థాన్ పౌరులపై ఆ రెండు దేశాలు గత కొంత కాలంగా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 15 లక్షల మందికి పైగా ఆఫ్గన్ వాసులు.. ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa