ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో యూఎస్ తదుపరి రాయబారిగా ట్రంప్ సన్నిహితుడు

international |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 09:16 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహిత సహాయకుడు, విధేయుడు అయిన సెర్గియో గోర్‌ను భారత్‌కు తదుపరి అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం సుంకాలను విధించాలన్న అమెరికా నిర్ణయం మరో నాలుగు రోజుల్లో అమల్లోకి రానుండగా.. ఈ ప్రకటన వెలువడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.


సెర్గియో గోర్ ఒక దశాబ్దానికి పైగా డొనాల్డ్ ట్రంప్‌కు విధేయుడిగా పని చేస్తున్నారు. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత ఆయన పరిపాలనలోనూ గోర్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కూడా ఆయన వైట్‌హౌస్‌లో ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పదవిలో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా 'అమెరికా ఫస్ట్' సిద్ధాంతాన్ని సమర్థించే దాదాపు 4,000 మందిని రికార్డు సమయంలో నియమించారు. ఫలితంగా ఫెడరల్ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల్లోని 95 శాతం ఉద్యోగాలను భర్తీ చేశారు.


అలాగే ట్రంప్‌నకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించడం, ఆయన తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటి పనులను కూడా గోర్ పర్యవేక్షించారు. గోర్ పట్ల తనకున్న నమ్మకాన్ని ట్రంప్ స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. "ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో నా అజెండాను అమలు చేయగల వ్యక్తి నాకు కావాలి. నేను పూర్తిగా విశ్వసించగలిగే వ్యక్తిగా సెర్గియో గోర్‌ను నియమిస్తున్నాను" అని ట్రంప్ పేర్కొన్నారు. ఇది చూస్తుంటేనే ఆయన ట్రంప్‌నకు ఎంత నమ్మకస్తుడో అర్థం అవుతోంది. అయితే అలాంటి నమ్మకమైన వ్యక్తినే తాజాగా ట్రంప్ భారత్‌కు అమెరికా రాయబారిగా ప్రకటించారు.


సెర్గియో గోర్‌ను కేవలం భారత్‌కు రాయబారిగా మాత్రమే కాకుండా దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాలకు ప్రత్యేక రాయబారిగా కూడా ట్రంప్ నియమించడం ఈ పదవి ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఈ రెండు బాధ్యతలు సాధారణంగా వేర్వేరు వ్యక్తులకు ఉంటాయి. ఈ నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదం అవసరం. అది పూర్తయ్యే వరకు గోర్ తన ప్రస్తుత పదవిలోనే కొనసాగుతారు. ఈ నియామకం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-అమెరికా సంబంధాల భవిష్యత్తుకు ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ముఖ్యంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం వంటి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50% సుంకాలు విధించాలని నిర్ణయించింది. అలాగే ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించడంపై కూడా అమెరికా అసంతృప్తిగా ఉంది. ఈ సున్నితమైన అంశాలను పరిష్కరించడం కొత్త రాయబారి సెర్గియో గోర్‌కు పెద్ద సవాలుగా మారనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa