ఉత్తర్ ప్రదేశ్లోని నొయిడా మహిళ నిక్కీ (28) వరకట్న హత్య కేసు యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అదనపు కట్నం కోసం నిక్కీని వేధించి, చిత్రహింసలు పెట్టిన అత్తింటివాళ్లు.. తన ఏడేళ్ల కుమారుడు ముందే ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త విపిన్ భాటీ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిక్కీ, ఆమె చెల్లెలు కంచన్లు ఒకే ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. 2016లో నిక్కీకి విపిన్తోనూ, అతడి తమ్ముడు రోహిత్తో కంచన్కు వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచి వేధింపులు మొదలయ్యాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భర్త వేధింపులను భరించలేక నిక్కీ దాద్రిలోని తన పుట్టింటికి వచ్చేసింది. కొద్ది రోజుల తర్వాత పెద్దల ముందు పంచాయతీ జరగడంతో భార్యకు విపిన్ క్షమాపణ చెప్పి, మళ్లీ ఇలాంటి తప్పు ఎప్పుడూ జరగదని ప్రమాణం చేశాడు. దీంతో అతడి వెంట వెళ్లేందుకు అంగీకరించిన నిక్కీ.. తన కష్టాలు తీరిపోయాయని అనుకుంది. కానీ, అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.
నిక్కీ, కంచన్లు ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుండటం విపిన్ కుటుంబానికి నచ్చలేదు. అంతేకాదు, సోషల్ మీడియాలో నిక్కీ రీల్స్ పోస్ట్ చేయడంపై కూడా భర్త విపిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండేవాడు. దీనిపై ఇరువురి మధ్య తరుచూ వాగ్వాదం జరిగేది. ఇదే సమయంలో విపిన్, అతడి కుటుంబం అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసేవారు. పెళ్లి సమయంలో నిక్కీ తండ్రి కట్నంగా స్కార్పియో, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, బంగారం, డబ్బు భారీగానే ఇచ్చారు. అయినా, అది సరిపోదని, ఇంకా తీసుకురావాలని వేధించేవారు. దీనిపై గత గురువారం మరోసారి వాగ్వాదం జరగడంతో నిక్కీపై విపిన్, అతడి తల్లి దాయ పెట్రోల్ పోసి నిప్పంటించారు.
తాజాగా, కంచన్ ఇన్స్టాలో స్పందిస్తూ.. సమాజానికి భయపడి తన సోదరి చాలా భరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆమెకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు.. ఈ రోజు కాకుంటే రేపైనా మార్పు వస్తుందని, అంతా బాగుంటుందని అనుకుని అనేక విషయాల్లో రాజీ పడింది.. కానీ, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు’ అని వాపోయింది. విషాద సమయంలో తమకు మద్దతు నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
‘ఇప్పుడు తీసుకునే చర్యలు ఫిబ్రవరి 11 లేదా 12న తీసుకుని ఉంటే ఇవాల ఇంతటి ఘోరం జరిగేది కాదు.. మన సమాజం సంప్రదాయాలు, కట్టుబాట్ల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నాం.. ’ అని కంచన్ కన్నీళ్లు పెట్టుకుంది. ఫిబ్రవరిలో కంచన్ తన సోదరి నిక్కీ, పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల ముందు పంచాయతీలో రాజీ కుదరడంతో ఇద్దరూ తిరిగొచ్చారు. తన కళ్లెదుటే అక్కను అత్యంత దారుణంగా హత్యచేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో విపిన్, అతడి తల్లిదండ్రులు దాయ, సత్యవీర్, సోదరుడు రోహిత్లను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa