భారత్-చైనా సంబంధాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనాలో పర్యటించనున్నారు. వచ్చే వారం చైనాలోని తియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సు సందర్భంగా మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.2020లో సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగిన తర్వాత ప్రధాని మోదీ చైనా గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన 20 మందికి పైగా ప్రపంచ నాయకులు హాజరుకానున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు ఈ సదస్సు దౌత్యపరంగా మరో ముఖ్యమైన వేదికగా నిలవనుంది.గత ఏడాది రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జిన్పింగ్, పుతిన్ చివరిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలు రష్యాను దూరం పెడుతున్నప్పటికీ, ఈ నాయకుల మధ్య సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్, చైనా, రష్యాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరపాలని ఆశిస్తున్నట్లు ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయ అధికారులు గత వారం తెలిపారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు జరపాలని భారత్, చైనా భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa