గతవారం ఇజ్రాయేల్పై హమాస్ ఆక్మసిక దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. హమాస్ మిలిటెంట్ల స్థావరం గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయేల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. అటు హమాస్ కూడా రాకెట్ దాడులు చేస్తుండగా.. లెబనాన్, సిరియా నుంచి మిలిటెంట్ల దాడులు మొదలయ్యాయి. దీంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్తు, ఆహారం, ఇంధన సరఫరాలను ఇప్పటికే నిలిపేసిన గాజాలో ఇజ్రాయేల్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో గాజావాసులు ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న షెల్టర్లకు పోటెత్తుతున్నారు.
ఇదిలా ఉండగా, బందీలుగా చేసుకున్నవారిని హమాస్ వదిలిపెట్టే వరకూ గాజాకు మానవతా సాయాన్ని అనుమతించబోమని ఇజ్రాయేల్ ప్రకటించింది. హమాస్ వారాంతపు దాడిలో కిడ్నాప్ చేసిన వ్యక్తులను విడుదల చేసే వరకు గాజాలోకి ప్రాథమిక వనరులు లేదా మానవతా సహాయాన్ని తమ దేశం అనుమతించదని ఇజ్రాయేల్ ఇంధన మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ గురువారం ప్రతిజ్ఞ చేశారు. ‘అపహరణకు గురైన ఇజ్రాయేలీలు ఇంటికి చేరుకునే వరకూ గాజాకు మానవతాసాయం అనుమతించం? గాజాకు మానవతా సహాయం? ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయబడదు.. నీటి కుళాయి తెరుచుకోదు.. బందీలు తిరిగి వచ్చే వరకు ఇంధన ట్రక్కు ప్రవేశించదు’ అని ఆయన ప్రకటించారు. గత శనివారం మెరుపు దాడులకు తెగబడిన హమాస్.. ఇజ్రాయేలీలు, విదేశీయుల సహా దాదాపు 150 మందిని అపహరించింది. వారిని క్షేమంగా వదిలిపెట్టే వరకూ గాజాకు ఎటువంటి సాయం అందనీయబోమని ఇజ్రాయేల్ ఉద్ఘాటించింది. గాజాకు వెళ్లే అన్ని దారులను మూసివేసిన ఇజ్రాయేల్.. హమాస్కు బయట నుంచి ఎటువంటి సహకారం అందకుండా చేస్తోంది.
గాజా నగరంలో ఉన్న ఏకైక విద్యుదుత్పత్తి కేంద్రంలో చమురు నిల్వలు బుధవారం అడుగంటడంతో దాన్ని కూడా షట్డౌన్ చేశారు. దీంతో గాజా వ్యాప్తంగా అంధకారం అలుముకుంది. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయని.. ఔషధాల కొరత మొదలైందని ‘డాక్టర్స్ విత్ఔట్ బౌండరీస్’ పేర్కొంది. విద్యుత్తు సరఫరా లేక, అత్యవసర శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి.. ఆక్సిజన్ యంత్రాలు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఔషధ నిల్వలు అయిపోయిన విషయాన్ని డబ్ల్యూహెచ్వో కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయేల్ వైపు నుంచి నిరంతరాయంగా రాకెట్ల దాడి జరుగుతోందని, సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు లేకుండా పోయాయని గాజా పౌరులు వాపోతున్నారు.
అటు, ఐదు రోజులుగా కొనసాగుతోన్న యుద్ధంతో ఇజ్రాయేల్లోనూ ఆహార కొరత మొదలైంది. కూరగాయలు, ధాన్యం ఎక్కువగా ఉండే దక్షిణ ప్రాంతంలో పోరు భీకరంగా సాగుతోంది. పంట చేతికొచ్చినా.. కోతకు అవకాశాల్లేకుండా పోయాయని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి... ఫుడ్చైన్ ఏర్పాటుకు హోల్సేలర్లు, రిటైలర్లకు ఆదేశాలు జారీ చేసింది. కబేళాలు, బేకరీలను నిరంతరాయంగా నడపాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa