ఉత్తరాఖండ్లో కుప్పకూలిన సిల్క్యారా సొరంగంలో పది రోజులుగా కార్మికులు చిక్కుకుపోయారు. వారిని బయటకు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు సోమవారం కొంత మేర ఫలించాయి. కొండ పైభాగంలో ఆరు అంగుళాల మేర 54 మీటర్ల లోతులో రంధ్రం చేసి.. దాని ద్వారా ఆహారం పంపారు. ఎండోస్కొపీ కెమెరాను లోపలికి పంపడంతో మొదటిసారి కూలీల ఫోటోలు బయటకు వచ్చాయి. కార్మికులు సేఫ్టీ టోపీలు ధరించి.. కెమెరాకు చేతులు ఊపుతూ తాము బాగానే ఉన్నామని కమ్యూనికేట్ చేస్తున్నారు. రెస్క్యూ అధికారులు, వాకీ టాకీ లేదా రేడియో హ్యాండ్సెట్ల ద్వారా కార్మికులతో మాట్లాడటం, కెమెరా ముందుకు రావాలని కోరడం కనిపించింది.
సోమవారం రాత్రి బాధితులకు బాటిళ్ల ద్వారా కిచిడీని పంపారు. అంత వరకూ వారు నీళ్లు, డ్రైఫ్రూట్స్తోనే సరిపెట్టుకున్నారు. వారికి మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను కూడా పైపు ద్వారా పంపినట్టు అధికారులు తెలిపారు. లోపలి చిక్కుకున్న కార్మికుల వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ.. వారంతా క్షేమంగా ఉన్నారని, త్వరలోనే బయటకు తీసుకొస్తామని చెప్పారు.
గత వారం స్థలాకృతి, ప్రాంతంలోని రాళ్ల స్వభావంతో సహా సవాళ్ల కారణంగా కార్మికులను రక్షించడానికి పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొండచరియలు విరిగిపడటం కూడా ప్రయత్నాలను అడ్డుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఐదు ఎంపికల కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కూలీలు చిక్కుకున్న సొరంగానికి మూడు వైపుల నుంచి డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. ఐదు వేర్వేరు సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించారు.
ప్రధాన సొరంగం కుడి, ఎడమ వైపుల నుంచి అడ్డంగా రెండు డ్రిల్స్, సొరంగం పై నుంచి నిలువు షాఫ్ట్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఐటీబీపీతో సహా బహుళ ఏజెన్సీల ద్వారా నిరంతరాయంగా రెస్క్యూ పని జరుగుతోంది. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం సోమవారం వచ్చి చేరింది. రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓ నుంచి నుంచి రోబోటిక్స్ బృందం కూడా చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa