ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్ణయాత్మక దశకు రామాలయ నిర్మాణం: భ‌గ‌వ‌త్‌

national |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 07:54 PM

రామాలయ నిర్మాణాంశం నిర్ణయాత్మక దశకు చేరుకుంది’ అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత  మోహన్ భగవత్ ప్రకటించారు. ప్రయాగరాజ్ వద్ద జరుగుతున్న కుంభమేళాలో రెండు రోజులపాటు జరిగిన విశ్వహిందూ పరిషత్ ధర్మ సంసధ్ లో మాట్లాడుతూ ఇప్పటివరకు చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితంగా ఆలయ నిర్మాణానికి చేరువయ్యామని, ఈ దశలో ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన సూచించారు. ఆలయం కోసం ఉద్యమిస్తున్న సంస్థలు, వ్యక్తులు లక్ష్యానికి దూరం కాకూడదని పిలుపునిచ్చిన ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైతే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కూడా వెనుకాడకూడదని హిందూ శ్రేణులకు ఆయన పిలుపిచ్చారు. మరో ఆరు నెలల పాటు ఇందుకు సంబంధించి వేచిచూడడం మంచిదేనని పేర్కొన్న ఆయన ఆ తర్వాత మాత్రం ఆలయ నిర్మాణం సాగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం పొందే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం మంచి పరిణామమని ఆయన ప్రశంసించారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేవరకు హిందువులు విశ్రమించరని  ధర్మ సంసధ్ తేల్చిచెప్పింది.  అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించి తీరాలని, అంతవరకు తాము విశ్రమించమని, అలాగే ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వమని ఒక  తీర్మానంలో వీహెచ్‌పీ స్పష్టం చేసింది. రామజన్మభూమి-బాబరీ మసీదు భూ వివాదాన్ని తేల్చడంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న జాప్యాన్ని ధర్మ సంసధ్ దుయ్యబట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వ తీరును కూడా విమర్శించారు. రెండురోజుల ఈ సభ ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంతంలోని వివాద రహిత మిగులు భూమిని తిరిగి ఇచ్చేయడానికి అనుమతించాలంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేయడాన్ని ప్రశంసించింది. రామాలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం సాధువుల్లో ఉందని, ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకుందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఇప్పటికే రామాలయం నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని, అయితే, హిందువు ఆత్మాభిమానానికి సంబంధించిన అంశాలు, అలాగే రామాలయం నిర్మాణం విషయంలో కేంద్రం అర్ధవంతమైన నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని ఈ సదస్సు వ్యక్తం చేసింది. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తొందరపాటుతో వ్యవహరించిందని కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ విమర్శించారు. అయోధ్య విషయంలో మాత్రం ప్రాధాన్యతాపూర్వకంగా వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఈ ధోరణి వల్ల మెజారిటీ హిందువుల్లో సుప్రీంకోర్టు పట్ల నమ్మకం సడలిందని మహంత్ రామ్‌జీదాస్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతోనే మళ్లీ అధికారంలోకి రావడం అన్నది మోదీ ప్రభుత్వానికి ఎంతమాత్రం సాధ్యం కాదని శ్యామ్ దేవచార్య మహారాజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘రామభక్తులు వారి జీవితాలను త్యాగం చేస్తున్నారు. అలాంటపుడు అధికారంలోనున్న వ్యక్తులు తమ కుర్చీలను ఒదులుకోలేరా?’ అని ఆయన ప్రశ్నించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa