ఇక ఈ జన్మలో ఇక రాజకీయాల జోలికి పోను అని ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్బాబు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ జన్మలో ఇక రాజకీయాల జోలికి పోనని ప్రకటించారు. తాను హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా విడుదల సందర్భంగా మోహన్ బాబు తన సినిమా విశేషాలతో పాటు రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. తన ఇంటికి ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వస్తే పలు రకాలుగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. తమ ఇంటికి బ్రేక్ ఫాస్ట్కు రావాలని తానే మంత్రి పేర్ని నానిని కోరినట్లు వెల్లడించారు. ఇకపై, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని మోహన్బాబు వెల్లడించారు. ఈ జన్మకు రాజకీయాలు వద్దని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు బంధువులు కాబట్టి ఎన్నికల్లో వారి కోసం ప్రచారం చేసినట్లు వివరించారు. చంద్రబాబు నాయుడుకు చేసినట్లు జగన్కూ ప్రచారం చేయాలి కాబట్టి చేశానని.. అది అక్కడితో అయిపోయిందని వెల్లడించారు. తాను ఇప్పుడు సినిమాలు, యూనివర్శిటీ పనులతో బిజీగా ఉన్నట్లు మోహన్ బాబు వివరించారు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల వైపు ఇకపై వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇటీవల మంత్రి పేర్ని నాని తనను కలవడానికి కారణాలను మోహన్ బాబు మీడియాకు వెల్లడించారు. తనకు ప్రతి రాజకీయ పార్టీలోనూ స్నేహితులు, బంధువులు ఉన్నారని చెప్పారు. ఏపీ మంత్రి పేర్ని నానితో తనకు పదేళ్లకు పైగా అనుబంధం ఉందన్నారు. ఇటీవలే తాము ఇద్దరం ఓ పెళ్లిలో కలిశామని.. బ్రదర్, మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తారా అని అడిగినట్లు తెలిపారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని చాలా మంది తప్పుపట్టారని మోహన్ బాబు గుర్తు చేశారు. తామిద్దరం సరదాగా మాట్లాడుకున్నామని.. అంతేగాని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన భేటీ గురించి ఎలాంటి చర్చ జరగలేదని వివరించారు. మా సినిమా వాళ్ళు ఏం మాట్లాడారో ఆ విషయాలు తనకు తెలియజేయాలని ఓ మంత్రిని ఎలా అడుగుతామని నిలదీశారు. ఇంటికి ఆహ్వానించిన అతిథిని గౌరవించాం.. అప్పుడప్పుడూ కలుద్దాం అనుకున్నామని మంత్రి పేర్ని నాని చెప్పారు. అయితే, దీన్ని రకరకాలుగా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పేర్ని నాని ప్రభుత్వ ప్రతినిధిగా తనతో మాట్లాడలేదని.. స్నేహితుడిగా మాత్రమే వచ్చినట్లు స్పష్టం చేశారు. తమ ఆతిథ్యం స్వీకరించిన పేర్ని నానికి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు చేసిన ట్వీట్ను కూడా తప్పుబట్టడం దారుణమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa