బెంగళూరు సిటీ నీటి కొరతతో అల్లాడిపోతోంది. రోజూ 50 కోట్ల లీటర్ల నీటి కొరతతో అక్కడి ప్రజలు అలమటించిపోతున్నారు. వాటర్ ప్రాబ్లం రావటంతో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. ముందే మేల్కొని నీటిని పొదుపుగా వాడుకోకపోతే ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లోనూ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోనూ కొన్నిచోట్ల నీటి ఎద్దడి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సిద్ధమయ్యారు.
నీటిని చాలా పొదుపు వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలా కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో రోడ్లపై చిన్నపాటి కాలువలా నీళ్లు వృథాగా పారుతుంటాయి. కొందరైతే తమ ఇంటి బోర్ మీట నొక్కి పైపు పట్టుకొని కారు లేదా ఫ్లోర్ కడుగుతూ యథేచ్ఛగా నీటిని వృథా చేస్తున్నారు. కొన్నిచోట్ల నీళ్లపైపు చేతపట్టుకుని వాకిళ్లను శుభ్రం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న జీహెచ్ఎంసీ కఠినమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు.
ఎవరైతే నీళ్లను వృథా చేశారో.. ఆ ఇంటికి రూ.5 వేలు ఫైన్ విధించనున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది రోజూ ఉదయం పూట క్షేత్ర పరిశీలనకు వెళ్తారు. ఏదైనా కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్ వద్ద నీరు వృథాగా పోతున్నట్లు కనిపిస్తే.. ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఫొటోలు తీస్తారు. ఆ తర్వాత సదరు ఇంటి యజమానులకు ఫైన్లు విధిస్తారు. ఈ మేరకు ఇప్పటికే కరపత్రాలు పంపింణీ చేశారు. నీళ్లను వృథా చేస్తూ పోతే హైదరాబాద్ మరో బెంగళూరు కావడానికి మరెంతో సమయం పట్టదని అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa