ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. సిట్‌కే షాకిచ్చిన ఐజీ ప్రభాకర్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 07:26 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాను ఇప్పట్లో హైదరాబాద్‌కు తిరిగి రాలేనని ఆయన తేల్చిచెప్పాడు. ఇదే కేసులో ఇప్పటి వరకూ నలుగుర్ని అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. వారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తదుపరి విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆశించిన మేర పురోగతి లేదు. ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. దీనికి కారణం ప్రధాన నిందితులైన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు విదేశాల్లో ఉండటమే. వాస్తవానికి అధికారులు తమంట తాముగా అనుమతి ఇచ్చుకుని, ట్యాపింగ్‌ చేయడం ఎక్కడా జరగదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కోసమే ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుకు ఆ అధికారాన్ని కట్టబెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొచ్చన్న చిన్న అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ప్రభాకర్‌రావు అండ్ కో చెలరేగిపోయినట్టు సిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ కేసు పురోగతి ప్రభాకర్‌రావు విదేశాల నుంచి తిరిగొస్తేనే సాధ్యమవుతుంది.


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాకముందే ఆయన వైద్యం కోసం అమెరికాకు వెళ్లిపోయారు. అయితే, కేసు నమోదయిన తర్వాత తాను పారిపోలేదని, జూన్‌ 26 నాటికి తిరిగొచ్చి, దర్యాప్తునకు సహకరిస్తానని కోర్టులో ఆయన మెమో వేశారు. అయితే, చెప్పిన గడువు ముగిసిపోయినా తిరిగి రాని ఆయన.. చికిత్సకు మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తోందని మెయిల్‌ ద్వారా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు... ఇంటర్‌పోల్ ద్వారా బ్లూకార్నర్‌ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు.


ఇంటర్‌పోల్‌‌కు లేఖ రాయాలని సీబీఐను సీఐడీ ద్వారా స్థానిక పోలీసులు కోరారు. దీనిపై సీబీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్‌పోల్‌కు సమాచారం ఇవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేసు నమోదుకు ముందే ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. అంతకుముందు కూడా వైద్యం కోసం వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్లు ధ్రువీకరించడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు బ్లూకార్నర్‌ నోటీసు జారీ కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa