ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 07:55 PM

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల నేపథ్యలో.. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మల్లింపులు చేశారు. ఈ క్రమంలోనే గోల్కొండలో జరిగే వేడుకలకు హాజరయ్యే వారి కోసం.. వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక రూట్‌మ్యాప్ తయారు చేశారు. గురువారం (ఆగస్టు 15న) రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని తెలిపారు. గోల్కొండ పరిసరాల్లో ప్రయాణించే వారు.. పోలీసులు సూచించిన ట్రాఫిక్ మళ్లింపులను అనుసరిస్తే.. తక్కువ సమయంలోనే వారివారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.


మరోవైపు.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం రాణిమహల్ లేన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ-గోల్డ్, ఏ-పింక్, ఏ-బ్లూ పాసులు అందజేశారు. పాసులు ఉన్న వారికే ఆయా రూట్లో అనుమతి ఉంటుంది. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్ పాసులు ఉన్నవారికి, పింక్, నీలం పాసులు ఉన్న వారికి గోల్కొండ కోట వరకు అనుమతి ఉండనుంది.


గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతే దర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పింక్ పాసులున్న వాహనదారులు.. కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లూ పాసులున్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.


ఇక.. సీ-గ్రీన్ పాసులున్న వాహనదారులు మాత్రం గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓసీ/జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు.. డీ-ఎరుపు పాసులున్న వారికి ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇక.. ఏ- బ్లాక్ పాసులన్న వాహనదారులకు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. మరోవైపు.. షేక్ పేట, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు అనుమతినిచ్చారు పోలీసులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa