ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 07:20 PM

తెలంగాణ గణేష్ ఉత్సవాలంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఒక ఎత్తయితే.. నిమజ్జన కార్యక్రమం మరో ఎత్తు. అందులోనూ.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు వేరే లెవల్. అయితే.. గణేష్ నిమజ్జనాలంటే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగరే. నిమజ్జనం రోజున ట్యాంక్ బండ్ మొత్తం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతుంది. పొద్దున మొదలుపెడితే.. ఆ తర్వాత రోజు కూడా నిమజ్జనం చేసే విగ్రహాలు ఇంకా మిగిలే ఉంటాయంటే.. ఎన్ని గణనాథులు హుస్సేన్ సాగర్‌ ఒడిలో చేర్చేందుకు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. హుస్సేన్ సాగర్‌లో గణనాథుల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఈరోజు పొద్దున ట్యాంక్ బండ్ చుట్టూ రెయిలింగులకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికల ఫ్లెక్సీలు కట్టారు. కట్ చేస్తే.. జీహ్ఎచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో గణేషుల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ప్రతి సంవత్సరం లాగానే.. ఈ ఏడాది కూడా హుస్సేన్‌ సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం సూచించింది. నిమజ్జనం సమయంలో వచ్చి ధిక్కరణ పిటిషన్‌ వేయటం సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 17 వరకు గణేషుల నిమజ్జనాలు కొనసాగనున్నాయి. ఇక.. చివరి రోజైన సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ బడా గణేషుడు.. భారీ శోభాయాత్రతో హుస్సేన్ సాగర్‌ ఒడికి చేనున్నాడు.


ఇదిలా ఉంటే.. హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసే కంటే ముందు.. ట్యాంక్‌బండ్‌ మార్గంలో భారీగా రెయిలింగులు ఏర్పాటు చేయటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హుస్సేన్ సాగర్‌లో గణేషులను నిమజ్జనం చేసేందుకు ఎలాంటి.. అనుమతి లేదని ఫ్లెక్సీలు కూడా పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్‌లో గణపతుల నిమజ్జనానికి అనుమతి లేదంటూ.. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం గమనార్హం. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే.. అటు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించటంతో.. గణేష్ ఉత్సవాల నిర్వహకులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa