సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణం.. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేపట్టనుంది. ఈమేరకు ప్రభుత్వంతో మెఘా కంపెనీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో.. మెఘా ఎండీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మెఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, మెఘా ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం చర్చలు జరిపారు.
స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది. ఈ క్యాంపస్లో అకాడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ నిర్మించనున్నట్టు పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి.. మెఘా కంపెనీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ శివారు కందుకూరు మండలంలో మీర్ఖాన్పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ శ్రేణి క్యాంపస్ నిర్మించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే భూమి పూజ నిర్వహించారు. కాగా.. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈరోజు సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. డిజైన్లకు తుది రూపం ఇచ్చి నవంబర్ 8వ తేదీన యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa