ట్రెండింగ్
Epaper    English    தமிழ்

200 గజాల్లోనే 7 అంతస్తుల అపార్ట్‌మెంట్.. ఒక్కటి కాదు పదులు.. ఐటీ కారిడార్ సమీపంలోనే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 06:59 PM

హైదరాబాద్‌లో ఓవైపు అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తూ హైడ్రా హడలెత్తిస్తుంటే.. అదేమీ పట్టనంటూ అక్రమార్కులు తమ పని తాము సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే.. ఏమాత్రం ఉపేక్షించకుండా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది హైడ్రా. ఇది ఇప్పుడు నగరంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం. ఈ క్రమంలో.. ప్రతిఒక్కరు నిర్మాణాలు చేపట్టాలంటే గజగజా వణికిపోతున్నారు. తమ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా.. బఫర్ జోన్‌లో ఉందా.. ప్రభుత్వ భూమి కిందికి వస్తుందా అంటూ.. ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటున్నారు.


అయితే.. ఇవేవీ తమకు వర్తించవన్నట్టుగా.. కొందరు అక్రమార్కులు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే.. తాము ప్రభుత్వ భూముల్లోనో, ఎఫ్టీఎల్ పరిధిలోనో, బఫర్ జోన్లలోనో నిర్మాణాలు చేపట్టట్లేదు కదా.. బుల్డోజర్లు మా బిల్డింగులపైకి రావు అనుకుంటూ తాపీగా అంతస్తుల మీద అంతస్తులు లేపేస్తున్నారు. కానీ.. ఎక్కడ నిర్మించినా భవనాలకు కొన్ని పరిమితులుంటాయని.. ఆ పరిమితులను మించి అంతస్తులు నిర్మించినా కూడా హైడ్రా బుల్డోజర్లు వస్తాయన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు.


ఈ క్రమంలోనే.. ఐటీ కారిడార్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో 200 గజాల్లోనే 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇలా ఒక్క బిల్డింగే కాదు.. ఆ ప్రాంతంలో చాలా భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. రెండు వైపులా ఎలాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండా బిల్డింగులు నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం అక్రమమని తెలిసినా.. విద్యుత్, జలమండలి అధికారులు కనెక్షన్లు కూడా ఇవ్వటం మరో చర్చనీయాంశం. మున్సిపాలిటీ అధికారులు రహదారులు కూడా నిర్మించారండోయ్.


అయితే.. ఈ ప్రాంతం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉండగా.. ఆ బహుళ అంతస్తుల భవనాల్లో ఒక్కదానికి కూడా మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవటం గమనార్హం. అయితే.. ఇక్కడ వందకుపైగా హాస్టళ్లు నిర్వహిస్తున్నా మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోగా... ఏడాది నుంచి భవన నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు కనీసం పరిశీలించకపోవటం గమనార్హం.


మూసీ యాత్ర అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు


నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో నివాస ప్రాంతాలున్న చోట ఇలా బహుళ అంతస్తుల భవనాలను పదుల సంఖ్యలో నిర్మిస్తున్నారు. అయితే.. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఈ బిల్డింగులు నిర్మిస్తే.. కంపెనీల్లో ఉద్యోగాలు చేసే యువత అక్కడ నివసించేందుకు ఆసక్తి చూపిస్తారని.. తద్వారా డబ్బు వెనకేసుకోవచ్చన్నది అసలు ప్లాన్. ఈ నేపథ్యంలోనే.. గౌలిదొడ్డి, గోపన్‌పల్లి ప్రాంతాల్లో వందకుపైగా హాస్టళ్లున్నాయి. వాటిల్లో ఒక్క హాస్టల్‌కు కూడా పర్మిషన్ లేకపోవటం గమనార్హం.


అయితే ఈ అక్రమ నిర్మాణాలపై స్పందించిన నార్సింగి మున్సిపల్ కృష్ణ మోహన్ రెడ్డి.. నిబంధనలు అతిక్రమించి, పరిమితులకు మించి అంతస్తులు నిర్మిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇటీవలే 12 భవనాలను కూల్చేశామని గుర్తు చేసిన కృష్ణమోహన్ రెడ్డి.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బిల్డింగులన్నింటినీ కూల్చేస్తామని హెచ్చరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa