ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరోగసి కోసం తీసుకొచ్చి.. నెల రోజులుగా ఫ్లాట్‌లో బంధించి పైశాచికత్వం.. భరించలేక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 11:18 PM

వివాహమే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టట్లేదన్న కారణంతో ఓ వ్యక్తి.. సరోగసి విధానంలో పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒడిశాకు చెందిన దంపతులతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం.. ఆ జంటను ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ భార్యాభర్తలకు మాయమాటలు చెప్పి ఇద్దరినీ వేరు వేరుగా ఉంచాడు. మహిళను నెల రోజులుగా ఫ్లాట్‌లోనే బంధించి.. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో.. అతని లైంగిక వేధింపులు భరించలేని ఆ మహిళ.. సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైహోం భూజా అపార్ట్‌మెంట్‌లో జరిగింది.


రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని మైహోం భూజా అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తులో ఉంటున్న 55 ఏళ్ల రాజేశ్ బాబు అనే వ్యక్తి.. సరోగసిలో పిల్లలు కనేందుకు ఒడిశాకు చెందిన దంపతులతో ఒప్పందం చేసుకున్నాడు. బిడ్డను కని ఇచ్చేందుకు రూ.10 లక్షలకు వాళ్లిద్దరి మధ్య ఒప్పందం కూడా కుదిరింది. దీంతో.. ఒప్పందం ప్రకారం అక్టోబర్ 24న ఆ దంపతులను హైదరాబాద్ తీసుకొచ్చాడు. 25 ఏళ్ల మహిళను తన ఫ్లాట్‌లోనే ఉంచుకున్న రాజేష్.. ఆమె భర్తకు మాత్రం అదే అపార్ట్‌మెంట్‌లోని మరో ఫ్లాట్ కేటాయించాడు.


కాగా.. నెల రోజులుగా ఆ మహిళను కనీసం బయటకు కూడా వెళ్లనీయకుండా రాజేష్ తన ఫ్లాట్‌లోనే నిర్బంధించాడు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. పైశాచికత్వం చూపించాడు. కనీసం భర్తతో కూడా మాట్లాడనివ్వకుండా వేధింపులకు గురి చేశాడు. రాజేష్ వేధింపులు భరించలేకపోయిన ఆ మహిళ.. సోమవారం (నవంబర్ 26న) అర్ధరాత్రి 9వ అంతస్తు పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.


సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. రాజేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. రాజేష్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిందన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నారు. దీంతో.. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. వివాహం జరిగి ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టని పక్షంలో.. కొందరు దంపతులు సరోగసి పద్దతిని ఆశ్రయిస్తుంటారు. ఈ పద్ధతిలో తమ బిడ్డను మరొకరు కని ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. అంటే.. పురుషుని సెమెన్, స్త్రీలోని అండాన్ని ఫలధీకరణం చేసి.. పిండాన్ని వేరే మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. కాగా.. ఈ సరోగసి పద్ధతి అనే ఒకరకమైన బిజినెస్‌గా మారిపోయింది. పిల్లల్ని నవమాసాలు మోసి కంటే.. తమ అందం తగ్గిపోతుందని భావించే కొందరు మహిళలు కూడా ఈ సరోగసిని ఆశ్రయిస్తుండటం గమనార్హం. అయితే.. ఈ సరోగసి అంటే ఒప్పందం కుదుర్చుకున్న మహిళ గర్బంలో పిండాన్ని ప్రవేశపెట్టటమే అన్న విషయాన్ని మరిచిపోయి.. ఆమెపై ఆ వ్యక్తి పశువులా ప్రవర్తించటం వల్ల ఓ మహిళ ప్రాణం పోయిందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa