ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన, ఆలోపే నియామకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 07:38 PM

రాష్ట్రంలోని వీఆర్వో వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి ఎక్కువగా వీఆర్వో వ్యవస్థ ద్వారానే జరగుతోందని భావించిన అప్పటి సీఎం కేసీఆర్.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీఆర్వోలుగా పని చేసిన పలువుర్ని.. వివిధ డిపార్ట్‌మెంట్‌లో సర్దుబాటు చేశారు. అప్పట్లో దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినా.. కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.


కాగా, తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతిలోగా వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది వీఆర్వోలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలిసింది. 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమిస్తారని సమాచారం.


ఇక మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న ఆర్వోఆర్‌ చట్టంపై సూచనలు చేయాలని మంత్రి పొంగులేటి కోరారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే ఆర్వోఆర్‌ చట్టానికి ఆమోదం తెలుపుతామని చెప్పారు. గురువారం సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించామని చెప్పారు. నిరసన తెలపాలనుకునే వారిని తాము అడ్డుకోబోమని చెప్పారు. ఈ నెలాఖరులోగా రెండేళ్లుగా వసతి గృహాలకు పెండింగ్‌లో ఉన్న బకాయిల సొమ్ములను విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తామని.. డిసెంబరు 31లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పొంగులేటి స్పష్టంచేశారు.


ఇక పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలను చేర్చామని వివరించారు. సర్వే అధికారులు పైరవీలు చేసే అవకాశం లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు 2.32 లక్షల దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.. ఐటీడీఏ పరిధిలో ఇళ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa