ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు,,,రేవంత్, కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 07:18 PM

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు కొనసాతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ఆరోపణలు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాన్ జబ్బలుగా మారారన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు.


రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లు ప్రాణ స్నేహితులుగా మారారని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ధరణి భూముల కుంభకోణం జరిగిందని మొదట రేవంత్ రెడ్డే ఆరోపించారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్, ఫాంహౌజ్ డ్రగ్స్ కేసుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని.. మొదట్లో రేవంత్ రెడ్డే ఈ విషయాలన్నీ మాట్లాడారని, కానీ ఇప్పుడు కేటీఆర్‌తో కుమ్మక్కై కేసులన్నింటినీ నీరుగారుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి కేటీఆర్ భూముల దోపిడీకి, అవినీతికి సహకరిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను కేటీఆర్ అసెంబ్లీలో నిలదీయడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) భూములను అమ్మడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, కేటీఆర్ లోలోపల సహకరిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.


రేవంత్ రెడ్డి, కేటీఆర్ రహస్యంగా కలుసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డీలిమిటేషన్ మీటింగ్‌‌కు ఇద్దరూ కలిసే వెళ్లారని బండి సంజయ్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో జరగబోయే బహిరంగ సభకు ఎవరెవరిని పిలవాలో కూడా ఇద్దరూ కలిసే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, ఇది కూడా వారిద్దరి నిర్ణయమేనంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్‌ను గెలిపించేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


తెలంగాణ ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించినా వారిలో మార్పు రాలేదని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంటే, రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసి బీజేపీపై బురదజల్లేందుకు కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


హెచ్ సీయూ భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎందుకంటే కేంద్రంలో కొనసాగుతుంది కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలన కాదని.. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన నరేంద్ర మోదీ పాలన అని అన్నారు. సీబీఐ విచారణకు సిద్ధపడితే హెచ్ సీయూ భూములను దోచుకునేందుకు ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్‌కు ఆ దమ్ముందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa