కేంద్ర బడ్జెట్ 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదంటూ విమర్శలు వస్తున్న వేళ.. కేంద్రం తీపికబురు వినిపించింది. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం రూ.9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుతో పోలిస్తే.. ఇది 11 రెట్లు ఎక్కువని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్న రైల్వే మంత్రి.. పనులు పూర్తి అయితే ఏపీలోని 73 రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోతాయన్నారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద కేంద్రం వీటిని అభివృద్ధి చేస్తోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, నమో భారత్ రైళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే రైళ్ల వేగానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవటానికి గల కారణాన్ని కూడా మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని.. అందుకే ప్రత్యేకంగా ప్రస్తావించలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వివరించారు. అలాగే ఏపీలో కొత్తగా 1,560 కి.మీ. రైల్వే ట్రాక్లు వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 16 జిల్లాల మీదుగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మరిన్ని వందేభారత్ రైళ్లు నడుపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఒడిశా, తమిళనాడుకు రైల్వే లైన్ల అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు.
మరోవైపు గతేడాది జులైలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం పెద్దమొత్తంలోనే నిధులు కేటాయించింది. అప్పట్లో రూ.9,151 కోట్లు నిధులను ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించారు. ఈ నిధులతో ఇప్పటికే పలుచోట్ల పనులు జరుగుతున్నాయి. కొత్ల రైల్వే లైన్లు, డబ్లింగ్ పనులు, స్టేషన్ల అభివృద్ధి్, రైల్వే ప్రయాణికుల కోసం మౌలిక వసతుల కల్పన సహా అనేక పనులు చేపడుతున్నారు. సుమారుగా రూ.74000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు ఏపీలో జరుగుతున్నట్లు గతేడాది జులైలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లోనూ ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించామని.. పనులను త్వరగా పూర్తిచేస్తామని రైల్వే మంత్రి చెప్తున్నారు.