ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ విద్యార్థులకు .. ప్రభుత్వం కొత్త కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 06:58 PM

చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యాశక్తి పేరుతో ప్రస్తుతం ఈ పథకం అమలు చేస్తున్నారు. విద్యాశక్తి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్పిస్తు్న్నారు. ఐఐటీ మద్రాస్‌లోని ఐఐటీఎం ప్రవర్తక్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ సహకారంతో ఆన్ లైన్ బోధన జరుగుతోంది. అయితే ఏపీ విద్యా శాఖ ప్రస్తుతం అనంతపురం, గుంటూరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది.


విద్యలో సంస్కరణల కోసం ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగానే వెనుకబడిన విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా అదనంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి అనంతపురం, గుంటూరు జిల్లాలలో పైలెట్ ప్రాజెక్టుగా విద్యాశక్తి అమలవుతోంది. ఈ జిల్లాలలో వచ్చే ఫలితాల ఆధారంగా జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యా శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఆరు నుంచి ఇంటర్ విద్యార్థుల వరకూ ఈ ఆన్ లైన్ బోధన జరుగుతోంది.


విద్యాశక్తి కింద స్కూలు, కాలేజీ సమయం పూర్తి అయిన తర్వాత చదువులో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకూ గంట పాటు జూమ్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తారు. అయితే పదో తరగితికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. వారికి పాఠశాలల్లోనే అదనపు తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యాశక్తి నుంచి వారికి మినహాయింపు ఇచ్చారు.


మరోసారి విద్యాశక్తి కింద చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన జరుగుతున్నప్పటికీ.. అది విద్యార్థులకు ఎంతమేరకు ఒంటబడుతోంది, వారు ఎంత వరకూ అర్థం చేసుకుంటున్నారనే దానిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ప్రతి శనివారం పరీక్షలు పెడుతున్నారు. వారం మొత్తంలో జరిగిన తరగతులపై పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షా ఫలితాల ఆధారంగా విద్యార్థుల పురోగతిని స్కూలు యాజమాన్యం అంచనా వేయనుంది. మరోవైపు స్కూల్ విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నో బ్యాగ్ డే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం ఈ నో బ్యాగ్ డే అమల్లోకి తెచ్చారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com