ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వమే ఉచితంగా, మీరే సెలక్ట్ చేసుకోవచ్చు.. ఏపీలో మరో కొత్త పథకం అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 05:59 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆదరణ-3 పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కులవృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆదరణ-2లో రాష్ట్రస్థాయిలో పరికరాలను ఎంపిక చేసి ఆ తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఆదరణ-3లో భాగంగా లబ్ధిదారులే తమకు కావాల్సిన పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశం కులవృత్తిదారులకు కల్పిస్తే వారికి ఏది అవసరమో అదే వారికి అందించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


ఆదరణ-3 పథకం అమలు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఆదరణ-2 సమయంలో 90శాతం రాయితీతో పరికరాలను అందజేస్తారు.. మిగిలిన 10శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఆదరణ-3లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తున్నారు. అధికారులు కులవృత్తిదారులతో ఆదరణ-3 పథకం కింద ఎలాంటి పరికరాలు అందించాలనే దానిపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ అధికారులు సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయా వృత్తుల వారికి అవసరమైన పరికరాల వివరాల్ని అధికారులు నమోదు చేశారు.


రాష్ట్రంలో 12 ఉమ్మడి జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి ఈ సమావేశాలను పూర్తి చేసి.. ఆ తర్వాత కులవృత్తిదారులను భాగస్వాములను చేస్తూ అమ్మకపు-కొనుగోలుదారుల ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తారు. కులవృత్తిదారుల కేంద్రంగానే ప్రతి దశలోనూ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీల్లో కులవృత్తులు 15 వరకు ఉండగా.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ కులవృత్తిదారులే కాకుండా తాపీ పని, ఎలక్ట్రీషియన్లు, ప్లంబింగ్ వంటి ఇతర వృత్తుల్లో ఉన్న బీసీలు తమకు కూడా చేయూత అందించాలని కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిన పంపనున్నారు. అయితే యాదవులు, కల్లుగీత కార్మికులకు వృత్తిపరంగా పరికరాలు లేకపోవడంతో.. కల్లు గీత కార్మికులకు మాత్రం సైకిళ్లు ఇచ్చారు. ఈసారి వారికి మోపెడ్‌లు అందజేయాలని కోరుతున్నారు. యాదవులు పాముల నుంచి రక్షణకు ప్రత్యేక షూలు ఇవ్వాలని కోరారు. సోలార్‌తో పనిచేసే టార్చ్‌లైట్‌లు, జీవాల కోసం షెడ్ల నిర్మాణానికి సహకారం అందించాలని వారు కోరుతున్నారు. మరి వీరి రిక్వెస్ట్‌లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తం మీద ప్రభుత్వం ఆదరణ-3 పథకాన్ని అమలు చేసే పనిలో ఉంది.. వీలైనంత త్వరగా లబ్ధిదారులను గుర్తించి వారికి పరికరాలు అందించే దిశగా కసరత్తు చేస్తున్నారు అధికారులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com