ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిశ మృతి కేసు.. మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 06:18 PM

 మహారాష్ట్రలో గతంలో సంచలం సృష్టించిన దిశా శాలియన్ మృతి వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశా శాలియన్ మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలువురు నటులు, పోలీస్ ఉన్నతాధికారులపైనా ఫిర్యాదులు అందాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ అయిన దిశా శాలియన్.. అతని కంటే వారం రోజుల ముందు అనుమానాస్పద రీతిలో చనిపోవడం పెను సంచలనం రేపింది. ఈ కేసులో ఆదిత్య ఠాక్రేను రక్షించేందుకు అప్పటి పోలీస్ ఉన్నతాధికారి పరంబీర్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అబద్ధాలు చెప్పారని దిశా శాలియన్ తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ తాజాగా మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు.


దిశా శాలియన్ మృతి కేసులో ఆదిత్య ఠాక్రేపై మంగళవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఠాక్రేతోపాటు నటులు సూరజ్‌ పంచోలి, డినోమోరియా, నటి రియా చక్రవర్తి, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌.. ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేలపైనా ఆ ఎఫ్ఐఆరో‌లో ఉన్నట్లు దిశా శాలియన్ తరఫు లాయర్ నీలేశ్‌ ఓఝా తాజాగా మీడియాకు తెలిపారు.


ఇక దిశా శాలియన్ మృతి కేసులో పరంబీర్‌ సింగ్‌ ప్రధాన సూత్రధారి అని.. ఈ కేసులో ఆదిత్య ఠాక్రేను కాపాడేందుకు మీడియా సమావేశం నిర్వహించి అబద్ధాలు చెప్పారని లాయర్ పేర్కొన్నారు. డ్రగ్స్ బిజినెస్‌లో ఠాక్రే హస్తం ఉందని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసిన దర్యాప్తులో వెల్లడి అవుతోందని తెలిపారు. తన కుమార్తె మృతి కేసుపై దిశా శాలియన్‌ తండ్రి సతీష్ శాలియన్‌ ఇటీవల ముంబై హైకోర్టును ఆశ్రయించి.. ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేయగా.. తాజాగా ఈ పరిణామం చోటుచేసుకుంది.


5 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అయితే సుశాంత్ చనిపోవడానికి వారం రోజుల ముందు అతని మాజీ మేనేజర్‌ దిశా శాలియన్‌.. 2020 జూన్ 8వ తేదీన ముంబైలోని ఓ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. దిశా శాలియన్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే సుశాంత్ కూడా తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఈ కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్య, అత్యాచారంతో పాటు సుశాంత్‌ మృతితోనూ ముడిపెడుతూ అనేక వాదనలు తెరపైకి వచ్చాయి.


గతంలో దిశ మృతిపై సతీష్ శాలియన్‌ మొదట్లో ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ 2020 జూన్‌ 8వ తేదీన తన కుమార్తె ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిందని.. ఆ పార్టీకి ఆదిత్య ఠాక్రేతో పాటు అతని బాడీగార్డులు, నటులు సూరజ్‌ పంచోలి, డినో మోరియా సహా మరికొందరు హాజరయ్యారని ఇటీవల ముంబై హైకోర్టులో సతీష్ శాలియన్ వేసిన పిటిషన్‌లో తెలిపారు. అంతేకాకుండా వారు ఆమెపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినట్టు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని లాయర్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com