దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 9.9 శాతం అధికం. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు పన్ను చెల్లింపుల్లో మెరుగుదల ఉండటంతో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన రూ. 1.84 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే మార్చిలో జీఎస్టీ వసూళ్లు 6.8 శాతం ఎక్కువ. మార్చి నెలలో స్థూల జీఎస్టీ ఆదాయంలో కేంద్ర జీఎస్టీ రూ. 38,100 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 49,900 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 95,900 కోట్లు, కాంపెన్సేషన్ సెస్ రూ. 12,300 కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. మార్చిలో మహారాష్ట్ర వాటా రూ. 31,534 కోట్లు. ఇది గత ఏడాది మార్చి కంటే 14 శాతం ఎక్కువ. కర్ణాటక రూ. 13,497 కోట్ల జీఎస్టీతో గతేడాదితో పోల్చితే 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. గుజరాత్ రూ. 12,095 కోట్ల జీఎస్టీతో గత సంవత్సరం కంటే 6 శాతం పెరుగుదలను కనబరిచింది. తమిళనాడు రూ. 11,017 కోట్లతో గతేడాది కంటే 7 శాతం వృద్ధిని సాధించగా, ఉత్తరప్రదేశ్ రూ. 9,956 కోట్లు వసూలు చేసి గతేడాది మార్చి కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఢిల్లీ రూ. 6,139 కోట్లు చెల్లించి ఆరో స్థానంలో నిలిచింది. ఇది 2024 మార్చి కంటే 5 శాతం అధికం. బీహార్ అత్యల్పంగా రూ. 2.6 కోట్లు జీఎస్టీ చెల్లించింది. లక్షద్వీప్ రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 4.033 కోట్లతో కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అయితే, అండమాన్ మరియు నికోబార్ దీవులు 60 శాతం వృద్ధితో రూ. 51 కోట్లు జీఎస్టీ చెల్లించాయి.
![]() |
![]() |