ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. బదిలీలపై ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 06:20 PM

ఉపాధ్యాయుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. టీచర్ల బదిలీల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొత్త చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. మే నెలలో బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం తొలిసారిగా ఉపాధ్యాయుల బదిలీలు చేయబోతున్నారు. ఇదేసమయంలో ఈసారి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానానికి అనుగుణంగా టీచర్ల సర్దుబాటు చేపట్టనున్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి ఐదో తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తారు.


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7,500 వరకూ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో 95 శాతానికి పైగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 430 పాఠశాలలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలోని ప్రతి వార్డు, గ్రామ పంచాయతీకి ఓ పాఠశాల ఏర్పాటు చేసేలా ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగియనుంది. మరోవైపు టీచర్ల సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియను కూడా ఏప్రిల్ 20వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల ఓ వైపు.. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మరోవైపు జరుగుతోంది. ఇవన్నీ పూర్తైన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు చేపడతారు.


మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మే మొదటి వారంలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ మొత్తం నడుస్తుంది. ఖాళీల ఆధారంగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలి.సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులను విద్యాశాఖ కేటాయిస్తుంది. ఇదే సమయంలో బదిలీ తప్పనిసరి అయిన ఉపాధ్యాయులు ప్రస్తుతం తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు. అలాగే రెండేళ్లు సర్వీసు పూర్తైన ఉపాధ్యాయులు తమకు నచ్చిన వాటితోపాటు తమ పాఠశాలను కూడా ఆప్షన్ కింద ఎంపిక చేసుకోవచ్చని తెలిసింది. ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీలకు పదోన్నతులు, ఎస్జీటీల బదిలీలు ఇలా ప్రక్రియ నడవనుంది. మే 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com