ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశీ విద్యా దీవెన పథకం తిరిగి అమలు,,,,చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 07:58 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువత, విద్యార్థులకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో చంద్రబాబు పర్యటించారు. పొన్నెకల్లులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.


సబ్‌ప్లాన్‌ ద్వారా దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్న చంద్రబాబు నాయుడు.. దళితులకు 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. విదేశీ విద్యా దీవెన కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.467 కోట్లు ఖర్చు చేసిందన్న చంద్రబాబు.. అప్పుడు ఈ పథకం ద్వారా 7 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. వైసీపీ హయాంలో కేవలం 437 మందికి మాత్రమే అవకాశం దక్కిందని వివరించారు.


చంద్రబాబు ఆరోగ్య పాఠాలు..


అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం


విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, విదేశీ విద్యాధారణ పేరుతో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు అమలయ్యాయి. విదేశాల్లో ఉన్నత చదువులు చదువాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించేవారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవటంతో ఈ పథకాల అమలు ఆగిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నవరత్నాలకు ప్రాధాన్యత ఇవ్వటంతో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం అమలు ఆగిపోయింది. అయితే 2022లో అప్పటి సీం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి ఈ పథకాన్ని పునఃప్రారంభించారు.


అయితే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని కాకుండా జగనన్న విదేశీ విద్యాదీవెన అంటూ పేరు మార్చి ఈ పథకం అమలు చేశారు. దీంతో అప్పట్లో కొన్నివర్గాల నుంచి నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి.. పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యాదీవెన. జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పేర్లను మార్చింది. గతంలో తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాలలో కొన్నింటిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం తిరిగి అమలు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com