ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వాసుల హత్య

Crime |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 10:53 PM

దుబాయిలో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక పాకిస్థానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని దారుణంగా నరికి చంపగా.. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వారిలో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్ (40) కాగా.. మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని వారి సహోద్యోగులు తెలిపారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులు కూడా తెలుగువారేనని తెలుస్తోంది. మృతులు , గాయపడిన వారితో పాటు ఈ ఘాతుకానికి పాల్పడిన పాకిస్థానీ వ్యక్తి కూడా దుబాయిలోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నారు.


పని ఒత్తిడి, ఇతర వ్యక్తిగత కారణాలతో పాటు మత విద్వేషం కూడా ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడు వారిని చంపిన తర్వాత మతపరమైన నినాదాలు చేశాడని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి. అయితే.. బేకరీ యాజమాన్యం ఈ ఘటనకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. విషయం బయటకు తెలిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో అక్కడి ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారని సమాచారం. దుబాయిలోని ఈ బేకరీలో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారేనని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దుబాయి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మృతి చెందిన వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కు భార్య, ప్రమీల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే గత వారం క్రితం ఇంట్లో నానమ్మ మృతి చెందగా పెద్దకర్మ జరిగిన రోజు శుక్రవారం అతని బావ ప్రమాదానికి గురై నిజామాబాద్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబంలో వరస సంఘటనలు జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.


గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల భద్రతపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించి.. దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. మృతుల కుటుంబాలకు సహాయం అందించడానికి.. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల భద్రత కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించడానికి.. వారికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడానికి భారత ప్రభుత్వం ఆయా దేశాలతో చర్చలు జరపాలని పలువురు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com