మన దేశంలోని చాలా నగరాల్లో ప్రస్తుతం వేగంగా జనాభా పెరిగిపోతోంది. జనాభాకు అనుగుణంగానే కార్లు, బైక్లు కూడా నిత్యం కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి. వీటికితోడు ట్యాక్సీలు, ఆటోలు, బస్సులు, లారీలు.. ఇలా రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ నెలకొంది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో నివసించే ప్రజలు.. తమ రోజులో కొన్ని గంటలపాటు ట్రాఫిక్లోనే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న కాలంలో మరింత ట్రాఫిక్ పెరిగిపోతుందనే సమయంలో.. ఎయిర్ ట్యాక్సీల రూపంలో భారీ ఊరట కలిగింది. ఈ క్రమంలోనే త్వరలోనే దేశంలోని రద్దీగా ఉండే నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలు ప్రవేశించనున్నాయి. తాజాగా ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలకు సంబంధించి.. కీలక అప్డేట్ వచ్చింది.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ సర్లా ఏవియేషన్.. భారత్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త విప్లవాన్ని తీసుకువస్తోంది. సర్లా ఏవియేషన్ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీ 'SYLLA SYL-X1' గ్రౌండ్ టెస్టింగ్ను సోమవారం (డిసెంబర్ 22వ తేదీన) సక్సెస్ఫుల్గా ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమాన నమూనా కావడం విశేషం. ' SYLLA SYL-X1' గ్రౌండ్ టెస్టింగ్ బెంగళూరులో మొదలైంది. 7.5 మీటర్ల రెక్కల పొడవు కలిగిన ఈ వాహనం.. భవిష్యత్తులో నగరాల్లో విమానంలా ఎగిరి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనుంది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం విశేషం.
ప్రాజెక్టు విశేషాలు, సామర్థ్యం
SYLLA SYL-X1 మోడల్ ఒక హాఫ్ స్కేల్ ప్రోటోటైప్. అంటే భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల అసలైన విమానానికి ఇది పునాది వంటిదని సర్లా ఏవియేషన్ సంస్థ తెలిపింది. ఈ ఫ్లయింగ్ టాక్సీ గంటకు సుమారు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్తుంది. హెలికాప్టర్ లాగా నిట్టనిలువుగా పైకి లేవడం.. సరిగ్గా అదే మాదిరిగా ల్యాండ్ కావడం దీనికి ఉన్న ప్రత్యేకత. దీంతో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీకి ఎలాంటి రన్ వే అవసరం లేదని పేర్కొంది.
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్తో సర్లా ఏవియేషన్ ఇప్పటికే ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి.. ఎయిర్పోర్ట్కు వెళ్లడానికి గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతోంది. అదే ఈ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వస్తే కేవలం 20 నిమిషాల్లోనే నగరంలో ఎక్కడినుంచైనా ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు. మొదటగా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపెగౌడ ఎయిర్పోర్ట్కు ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను సర్లా ఏవియేషన్ సంస్థ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ఈ సర్లా ఏవియేషన్ సంస్థ ఇప్పటివరకు సుమారు 13 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ. 116 కోట్ల నిధులను సేకరించింది. ఇందులో ప్రముఖ ఇన్వెస్టర్లు.. జిరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్, బిన్నీ బన్సల్ కూడా ఉన్నారు. 2028 నాటికి బెంగళూరులో వాణిజ్యపరంగా ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని సర్లా ఏవియేషన్ కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, పుణె నగరాలకు కూడా విస్తరించాలని ప్రణాళికలను పెట్టుకుంది. కేవలం ప్రయాణికుల రవాణాతో పాటు.. అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను కూడా అందించాలని ఆ సంస్థ నిర్ణయించింది.
ఈ ఎయిర్ ట్యాక్సీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. మెట్రో నగరాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకునే సమస్య నుంచి నగరవాసులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. విమానం ధర కాకుండా.. ప్రీమియం ట్యాక్సీ ఛార్జీలకే సుమారు రూ.1,500 నుంచి రూ. 1,700 వరకు ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను అందించేలా ఆ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa