భారత్, యూఏఈలను కలుపుతూ అరేబియా సముద్రం అడుగున అత్యంత వేగవంతమైన రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఒక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు వైపు అడుగులు పడుతున్నాయి. సుమారు 2 వేల కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గం ద్వారా ముంబై నుంచి దుబాయ్కి కేవలం రెండు గంటల్లోనే ప్రయాణ సమయం పూర్తి కానుంది. ఈ మార్గం కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా.. ఇరు దేశాల మధ్య చమురు, మంచి నీటి రవాణాకు కూడా ఉపయోగపడనుంది. దీనికి డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు.
ఈ డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ మామూలు సాధారణ రైలు మాత్రం కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ లేదా సూపర్సోనిక్ రైలు అని పేర్కొన్నాయి. ప్రస్తుతం విమానంలో ముంబై నుంచి దుబాయ్ వెళ్లడానికి అతి తక్కువగా డైరెక్ట్ ఫ్లైట్ అయితే 3 గంటల నుంచి 3.5 గంటల సమయం వరకు పడుతుంది. ఈ డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా కేవలం 2 గంటల్లోనే ముంబై నుంచి దుబాయ్ చేరుకోవచ్చు. అంటే ముంబైలో బ్రేక్ఫాస్ట్ చేసి.. దుబాయ్లో లంచ్ చేయవచ్చన్నమాట.
ఈ ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైన అంశం పనోరమిక్ విండోస్. సముద్రం మట్టానికి 200 మీటర్ల లోతులో నిర్మించే ఈ సొరంగ మార్గంలోని గోడలకు పారదర్శకమైన కిటికీలు (పనోరమిక్ విండోస్) ఉంటాయి. వాటి ద్వారా అండర్ వాటర్ వ్యూను ప్రయాణికులు ఆస్వాదించవచ్చు. ప్రయాణికులు అత్యంత వేగంగా ప్రయాణిస్తూనే.. కిటికీల నుంచి షార్క్లు, తిమింగలాలు, రంగురంగుల చేపలను చూసే అద్భుత అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన అక్వేరియంలో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇవ్వనుంది.
ఈ సొరంగం కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా.. రెండు దేశాల ప్రధాన అవసరాలను తీర్చనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దుబాయ్ నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ ముడి చమురు.. పైపులైన్ల ద్వారా రవాణా అవుతుంది. అదే సమయంలో భారత్ నుంచి దుబాయ్కి.. స్వచ్ఛమైన మంచినీటిని ఎగుమతి చేస్తారు. ఈ డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తే.. రెండు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతులు మరింత సులువు అవుతాయని భావిస్తున్నారు.
ప్రాజెక్టు వ్యయం, ప్రయోజనాలు
ఈ అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టు వ్యయం సుమారు 50 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 50 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ముంబై, దుబాయ్ మధ్య ప్రయాణ ఖర్చులు విమాన టికెట్ల కంటే సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే ఈ డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు గురించి ఇప్పటికే భారత్, యూఏఈ దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2030 నాటికి ఈ కలల ప్రయాణం సాకారం కావచ్చని ప్రాజెక్ట్ నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీరింగ్ డిజైన్లు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa