ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ..,బర్డ్ ఫ్లూ భయం వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 07:16 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. దీంతో ప్రజలు చికెన్ తినాలంటే హడలిపోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సైతం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే చికెన్ లవర్స్‌కు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ఏపీ పశుసంవర్ధక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఏపీతో పాటుగా పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా కోళ్లఫారాలలో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే వేలాది కోళ్ళు చనిపోయాయి. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి టెస్ట్ చేస్తే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.


ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా కానూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు చికెన్ దుకాణాలను మూసి వేయించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసిన ప్రాంతం నుంచి కిలోమీటర్ పరధిని అలర్ట్ జోన్‌గా ప్రకటించారు. అలాగే 10 కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతం నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అలాగే అలర్ట్ జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో బాగా ఉడకబెట్టిన చికెన్, కోడిగుడ్లు తినొచ్చని ఏపీ పశుసంవర్ధక శాఖ తెలిపింది. బాగా శుభ్రం చేసిన, ఉడికించిన మాంసం తినొచ్చని తెలిపింది.


  మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ పశువులు, పక్షులు, జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. కోళ్ల నుంచి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోళ్లఫారాలలో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే బర్డ్ ప్లూ వైరస్ బారినపడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా గడిపినవారికి, ఈ వైరస్ సోకిన కోళ్లను తిన్న వారికి ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఉడికీ ఉడకని చికెన్ తినడం ద్వారా కూడా మనుషులకు విస్తరించే ప్రమాదం ఉంది. మరోవైపు బర్డ్ ప్లూ వైరస్ సోకితే.. వ్యాధి లక్షణాలు 2 నుంచి 6 రోజుల్లో కనిపిస్తాయి. జ్వరంతో పాటుగా, జలుబు, ముక్కుకారడం, శ్వాసలో ఇబ్బంది, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇక బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే చికెన్ రేట్లు పడిపోగా.. ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. చేపలు, రొయ్యలు వంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com