భారీమొత్తంలో బకాయిపడిన ఉపాధిహామీ నిధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ల జాతీయాధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ నిధుల చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడితీసుకువచ్చేందుకు ఉద్యమబాట పట్టనున్నామంటూ ఛలో అమరావతికి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.2500 కోట్ల ఉపాధి హామీ నిధులు బకాయిపడిందని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఈ నిధుల విడుదల కోసం ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కనికరించడం లేదని... అందువల్లే నిరసన బాట పట్టినట్లు తెలిపారు. ఉపాధిహామీ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సర్పంచుల సంఘం, ఎంపీటీసీల సంఘం, ఎంపీపీల సంఘం, జడ్పీటీసీల సంఘాలతో రాజేంద్రప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వివరించారు. తమకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యమ ప్రణాళిక రూపొందించిట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నెల 28నుంచి నవంబర్ 3వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాలలో సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే వచ్చేనెల అంటే నవంబర్ 4 నుంచి 20వరకు 13 జిల్లాల్లోనూ కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక చివరగా నవంబర్ నెలాఖరున ఛలో అమరావతిని చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకి అతీతంగా చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమంలో అన్ని పార్టీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. ఉపాధి హామీ నిధులు విడుదల చేసేవరకు ఈ ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతాయని... ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని బాబు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa