ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీపై చంద్రబాబు ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 09:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. వల్లభనేని వంశీమోహన్ ను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి గట్టి దెబ్బేనని భావిస్తున్నతరుణంలో చంద్రబాబు తన వ్యూహాలకు పదునుపెట్టారు.  తన పార్టీలో ఉంటూ తాను టికెట్ ఇస్తే గెలిచిన వల్లభనేని వంశీమోహన్ టీడీపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతుంటే చూస్తూ ఊరుకుంటానా అన్న చందంగా చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. వల్లభనేని వంశీమోహన్ ను బుజ్జగించే ప్రయత్నం చేయడం కూడా మానేశారట చంద్రబాబు. వంశీతో అమితుమీకి సిద్ధమయ్యారట. గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలపై పార్టీ కీలక నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వంశీ పార్టీవీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై చర్చించారు. వంశీని టీడీపీలోనే ఉండాలంటూ బుజ్జగించే ప్రయత్నాలు చేయోద్దని కూడా గట్టిగా చెప్పారట చంద్రబాబు. వంశీ వైసీపీలోకి వెళ్లాలంటే టీడీపీకి రాజీనామా చేయాలని అలా అయితేనే జగన్ పార్టీలో చేర్చుకుంటారని పార్టీ నేతలు చంద్రబాబుకు చెప్పారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలకు సన్నద్ధంగా ఉండేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారట. ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను రెడీ చేసేశారట చంద్రబాబు. గన్నవరం టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు చంద్రబాబు 10 మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వారిలో ముందుగా ఐదుగురు పేర్లను బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది. వంశీ రాజీనామా చేస్తే గన్నవరంలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు ఖచ్చితంగా చెప్తున్నారు. చంద్రబాబు టాప్ 5 లిస్ట్ లో మాజీ ఎమ్మెల్యేలు  బోండా ఉమా, దేవినేని ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్, గద్దె అనురాధ, యువనేత దేవినేని అవినాష్ పేర్లు ఉన్నాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నేతలు పోటీ చేసేందుకు అయిష్టత చూపితే  వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుని టీడీపీలోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారట. యార్లగడ్డ వెంకట్రావును టీడీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అప్పగించారట మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. మెుత్తానికి వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీని వీడతారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు. గతంలో ఎవరైనా టీడీపీని వదిలితే బుజ్జగించే చంద్రబాబు వంశీ విషయంలో అలా చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa