ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌పై అచ్చెన్న ఫైర్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 01:37 PM

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యేనని, ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ధూళిపాళ్ల అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పిరికిపందచర్యగా వర్ణిస్తూ , టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఈరోజు ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.


ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతలపై వేధింపులకు దిగుతూ రాక్షసానందం పొందుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారనే అక్కసుతో టీడీపీ నేత, సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని, రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్ల నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఏమీ చేయలేక చివరకు దొంగదారిలో సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్యేనన్నారు.


ధూళిపాళ్ల ఏం తప్పు చేశారని ఆయన ఇంటికి 100 మంది పోలీసులను పంపారు? ఆయనేమైనా తీవ్రవాదా లేక ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా? సంగం డెయిరీ అభివృద్ధిలో ఏనాడూ రాజీ పడలేదు. నిరంతరం పాల ఉత్పత్తి దారుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేసారని, గుజరాత్ కు చెందిన అమూల్ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దూళిపాళ్ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విడుదల చేసినట్లు గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టి శ్రేణులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa