by Suryaa Desk | Fri, Oct 18, 2024, 10:55 AM
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణియించింది హైడ్రా. ట్రాఫిక్ సమస్యకు ఫుట్పాత్ల ఆక్రమణ కూడా ఓ కారణంగా భావిస్తున్న హైడ్రా.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసింది. త్వరలోనే ఆపరేషన్ ఫుట్ పాత్ను స్టార్ట్ చేయనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ కమిషనర్ విశ్వప్రసాద్ సమావేశమయ్యారు. ట్రాఫిక్ సమస్య సహా ఫుట్పాత్ ఆక్రమణలపై చర్చించారు. ఎక్కడెక్కడ ఫుట్పాత్లు ఆక్రమణలకు గురయ్యాయో గుర్తించి, ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత బుల్డోజర్లతో వెళ్లి కూల్చేయనున్నారు. కేవలం ఫుట్పాత్పై ఆక్రమణలే కాదు.. ఆ ఫ్లేస్లో ప్రభుత్వానికి చెందిన ఎలాంటి షాపులున్నా, ఏమాత్రం ఆలోచించకుండా కూల్చేయనున్నారు.ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపుతో పాటు డీఆర్ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. వర్షం పడినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తక్షణమే నీరు తొలిగించేలా హైపవర్ మోటర్లను వినియోగించాలని నిర్ణయించారు. హైడ్రా, ట్రాఫిక్ విభాగం కలిసి వరద కాలువలు, పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, కొత్త లైన్లను వేసి వరదకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు.
అలాగే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగాలతో కలిసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటమే కాదు.. నగర ప్రజలు సాఫీగా నడచుకుని వెళ్లే విధంగా ఫుట్పాత్లను రూపొందించాలని నిర్ణయించింది హైడ్రా. అలాగే కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించాలని డిసైడైంది. మొత్తంగా.. పలు విభాగాలు, ప్రజల భాగస్వామ్యంతో భాగ్యనగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది హైడ్రా.