తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రచారపర్వం పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించగా.. కీలక విషయాలు వెల్లడించారు. మార్చి 17వ తేదీన పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కాగా.. ఈరోజు మే 11 వ తేదీ వరకు అంటే 25 రోజుల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేసినట్టు వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల కోడ్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సుమారు 8 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. వాటితో పాటు డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మే 11వ తేదీన నిర్వహించనున్న పోలింగ్ విధుల్లో సుమారు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొననున్నట్టు స్పష్టం చేశారు. ఈరోజుతో ప్రచారం పర్వం ముగుస్తోందని.. ఇప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
అయితే.. పోలింగ్ ముగిసేవరకు ఎక్కడైనా రాజకీయ నేతలు ప్రలోభాలకు పాల్పడితే.. సీ విజిల్, టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయాలని వికాస్ రాజ్ సూచించారు. సీ విజిల్, టోల్ ఫ్రీ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. పోలింగ్ బందోబస్తు నిమిత్తం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని వికాస్ రాజ్ తెలిపారు. దాదాపు 60 వేల మంది రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులతో పాటు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పోలీసులు వస్తారన్నారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వెల్లడించారు. పోలింగ్ కోసం 87 వేలకుపైగా బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 20 వేల బ్యాలెట్ యూనిట్లు స్పేర్గా ఉంచుతామని వికాస్ రాజ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa