విద్యుత్ శాఖలో వింత పోకడ కొనసాగుతోంది.ట్రాన్స్ కో అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉద్యోగి తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి అతనికి పదోన్నతి కల్పించి విమర్శలపాలవుతున్నారు ఆ శాఖ అధికారులు.కరీంనగర్ జిల్లా మానకొండూర్ సెక్షన్ పరిధిలోని సదాశివపల్లి సమీపంలో ఇటీవల విద్యుత్ ప్రమాదం జరిగింది.సదాశివపల్లి జూనియర్ లైన్ మెన్ గా పని చేస్తున్న ఉద్యోగి అతడు చేయాల్సిన పనులను ముంజంపల్లి గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి(వృద్ధుని)తో ట్రాన్స్ పార్మర్ మరమ్మత్తులు చేయిస్తుండగా వృద్ధునికి విద్యుత్ షాక్ తగిలింది.ఈ ప్రమాదంలో ప్రైవేటు వ్యక్తి తలకు,చేతులకు,శరీరంపై తీవ్రంగా గాయాలయ్యాయి.అతన్ని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి రహస్యంగా చికిత్స చేయించారు.విద్యుత్ ప్రమాదం పూర్తిగా జెఎల్ఎం నిర్లక్ష్యంతోనే జరిగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది.ఆసుపత్రిలో చికిత్సకు అయిన ఖర్చంతా జెఎల్ఎం భరించాడట.
ఐతే జరిగిన ప్రమాదంపై డివిజనల్ ఇంజనీర్(టెక్నీకల్)సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.ప్రమాదంపై విచారణ ఎటూ తేలకుండానే జూనియర్ లైన్ మెన్ కు అసిస్టెంట్ లైన్ మెన్ గా పదోన్నతి ఇచ్చారు.ఈ నెల 15న జెఎల్ఎం పదోన్నతి ఉత్తర్వుల కాపీని మానకొండూర్ సెక్షన్ ఏఈ చేతుల మీదుగా అందుకున్నాడు.ప్రమాదానికి బాధ్యుడైన ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు.ఈ నెల 6న ప్రమాదం జరిగితే 15న పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.విద్యుత్ ప్రమాదానికి కారకుడైన ఉద్యోగికి పదోన్నతి కల్పించడం వెనుక ఎం జరిగి ఉంటుందన్నది తోటి ఉద్యోగులకు కూడా అర్ధం కావడం లేదట.విద్యుత్ ప్రమాదం,ప్రమాదంపై జరిగిన విచారణ గోప్యంగా ఉంచారా? లేక ప్రమాదం గురించి అధికారులకు తెలిసి వేటికైనా తలొగ్గి పదోన్నతి కల్పించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విద్యుత్ శాఖలో జరుగుతున్న అక్రమ పదోన్నతులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa