ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ ప్రమాణాలతో బాపూ ఘాట్‌.. ప్రత్యేకతలివే, కేంద్రమంత్రికి వివరించిన సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 11:05 PM

తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం నిర్మించ తలపెట్టారు. ఈ నేపథ్యంలో సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఈ మేరకు మంత్రిని కలిసి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.


మ‌హాత్మాగాంధీ గారి చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను చాటిచెప్పే కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని త‌మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రాజెక్టు వివరాలను కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ సిద్దాంతాల‌ను ప్రచారం చేసే నాలెడ్జ్ హ‌బ్‌, ధ్యాన గ్రామం (మెడిటేష‌న్ విలేజ్‌), చేనేత ప్రచారం కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (Statue of Peace), మ్యూజియంల‌తో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టనున్నామ‌ని సీఎం కేంద్రమంత్రికి వివ‌రించారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దిలీ చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.


కొత్త ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించండి..


వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుని విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లను భార‌త విమాన‌యాన సంస్థ (AAI)కి అంద‌జేసినట్లు తెలిపారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై మంత్రిని కలిసి చర్చించారు.


రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. వరంగల్‌తో పాటు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌లలో ప్రతిపాదిత విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రికి నివేదించారు. వరంగల్‌తో పాటు మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించారు. ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి 150 కి.మీ దూరం ఉండాలన్న నిబంధన అడ్డురాదని, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం పొందిన అంశాన్ని సీఎం రేవంత్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa