ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్.. ఆ పని చేయకపోతే రాష్ట్రమంతా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 07:30 PM

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కీలక డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై.. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కవిత సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వార్తలు వస్తున్నాయన్న కవిత.. బీసీల రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరిపేందుకు వీలు లేదన్నారు.


అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌‌లో హామీ ఇచ్చినట్టుగా కవిత గుర్తు చేశారు. బీసీల జనాభా ఎంతో తెలియకపోతే హామీ ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలే ఉన్నారని.. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో ఇప్పటికీ అంతుపట్టడం లేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు పెంచని పక్షంలో ఎన్నికలు జరగనివ్వబోమన్నారు. మండల కేంద్రాలు, జిల్లాల్లో, రాష్ట్రవ్యాప్తంగా.. బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపడుతామని కవిత హెచ్చరించారు.


42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కవిత వార్నింగ్ ఇచ్చారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తరువాత.. బీసీ జనాభాను వెల్లడించాకే ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. మరోవైపు.. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.


ఇక.. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లపై ఓ క్లారిటీ వస్తుందని.. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం పెద్దలు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరి ప్రభుత్వం ఎలాంటి అడుగు వేస్తుందన్నది క్లారిటీ రావాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa