ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 07:11 PM

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు నేతలపై బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం (ఫిబ్రవరి 10న) విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.


పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేయొద్దని.. ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలు పార్టీలు మారి 10 నెలలు అయిందని గుర్తు చేసిన సుప్రీం కోర్టు.. ఇది రీజనబుల్ టైం కాదా అంటూ ఎమ్మెల్యేల తరపు లాయర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తనకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజుల సమయం కావాలని ఎమ్మెల్యేల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి అడిగారు.


ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను కోట్ చేస్తూ.. రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని.. ఇప్పుడు ఏకంగా 10 నెలలు గడిచిపోయాయని బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదించారు. రీజనబుల్ టైమ్ అంటే ఎంత సమయం కావాలో చెప్పండంటూ ధర్మానసం ముకుల్ రోహిత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెపుతామని ముకుల్ రోహత్గి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.


బీఆర్ఎస్‌ పార్టీలో గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే ఈ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌పై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోందని.. సుప్రీంకోర్టు జోక్యంతో వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ అనర్హత వేటు పడితే.. తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa